ములుగు: నేరాల నియంత్రణకు ఉమెన్ హెల్ప్ డెస్క్ల ద్వారా.. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నాం. మహిళలపై గృహహింస, దాడులు వంటి కేసులపై వేగంగా దర్యాప్తు జరిపి న్యాయస్థానంలో బలమైన సాక్ష్యాలు సమర్పించి కన్వెక్షన్ శాతాన్ని పెంచుతున్నాం..జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 185 కేసులు నమోదు కాగా 15కేసుల్లో ట్రయల్ పూర్తై కన్వెక్షన్ వచ్చిందని జిల్లా షీటీమ్ ఎస్సై మౌనిక వెల్లడించారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షితో ఆమె మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో నిఘా
మహిళలపై దాడులు జరగకుండా మహిళ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. యువతులు, మహిళలు, విద్యార్థినులకు ఆకతాయిలు వేధించకుండా చర్యలు చేపడుతున్నాం. పాఠశాలలు, ప ర్యాటక ప్రదేశాల్లో షీటీమ్ బృందాల నిఘా ఉంది.
బాధితులు ఫిర్యాదు చేయాలి
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పీఎస్లో ఉమెన్ హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. డెస్క్లలో మహిళా పోలీస్లే విధులు నిర్వహిస్తున్నారు. బాధితులు భయపడకుండా వచ్చి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో 100కు లేదా మహిళల హెల్ప్లైన్ 181కు, 8712576528 నంబర్కు కాల్ చేయాలి.
అవసరం మేరకు సోషల్ మీడియా వాడాలి
సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించుకోవాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని పర్సనల్ ఫొటోలు పంపవద్దు.
చట్టాలపై అవగాహన సదస్సులు
మహిళలపై నేరాలు జరిగినపుడు ఎవరికి చెప్పుకోవాలో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలను చైతన్యవంతులను చేస్తున్నాం. పాఠశాలలు, పర్యాటక ప్రదేశాల్లో మహిళల భద్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
● ఉమెన్ హెల్ప్డెస్క్లతో బాధితులకు న్యాయం
● సాక్షితో షీటీమ్ ఎస్సై మౌనిక


