ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ ప్రథమ,
26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు
● జిల్లావ్యాప్తంగా పది సెంటర్ల ఏర్పాటు
ఏటూరునాగారం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పది కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 3,841 విద్యార్థులు రేపటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేశారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, టేబుల్స్, చెత్తాచెదారం తొలగింపుతో పాటు ప్రశాంతమైన వాతావరణం కలిగేలా కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రానికి ప్రతీ విద్యార్థి 30 నిమిషాల ముందు చేరుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
10 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు
ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డిపార్ట్మెంట్ ఆఫీసర్కు అలాట్ చేశారు. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష కేంద్రానికి, నిర్వహణ బాధ్యతలను చేపట్టే చీఫ్ సూపరింటెండెంట్ను నిర్ణయించి విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను కేటాయిస్తారు. అలాగే జిల్లా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో పాటు ఒక సిట్టింగ్ స్క్వాడ్ టీం బృంధం, మరో టీం కస్టోరియల్ టీం ఈ పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నియమించారు.
నియమాలు పాటించాలి
పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, డిటిజల్ వాచ్లు, సెల్ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. నిర్ధిష్టమైన ఆదేశాలను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. అంతేకాకుండా 200 మీటర్ల వరకు జిరాక్స్ షాపులను కూడా మూసివేయనున్నారు. ప్రశ్నపత్రాలు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు, 144 సెక్షన్ను సైతం అమలు చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్క్వాడ్లను కూడా కేటాయించాం. పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి పోలీసుశాఖకు సమాచారం అందించాం.
– నాయిని వీరేందర్,
ఇంటర్మీడియట్ జిల్లా అధికారి
పరీక్ష రాయనున్న విద్యార్థుల వివరాలు..
ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,773 మంది, ఒకేషనల్ విద్యార్థులు 208 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,632 కాగా ఒకేషనల్కు చెందిన విద్యార్థులు 228 మంది ఉన్నారు. మొత్తంగా 3,841 మంది పరీక్షలు రాయనున్నారు.
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం


