సాక్షి, హైదరాబాద్: కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గన్ ఫైర్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించగలిగారు. వాళ్లను ట్రేస్ చేసి పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
శనివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు క్యాష్ బ్యాగుతో పారిపోయారు. బుల్లెట్ గాయమైన బాధితుడ్ని సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.6 లక్షల చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ఐదు బృందాలను నియమించారు. అయితే..
బాధితుడి స్కూటీపైనే పారిపోయిన నిందితులు.. కాచిగూడ దగ్గర ఆ బండి వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో.. 800కు పైగా సీసీకెమెరాలను పరిశీలించిన ప్రత్యేక బృందాలు వాళ్ల ఆచూకీని కనిపెట్టగలిగాయి. నిందితుల్లో ఒకడ్ని పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు.. సెల్ఫోన్ పవర్ డంపింగ్ ద్వారా వాళ్ల మొబైల్ నెంబర్లు సేకరించగలిగారు. ఆ నెంబర్ల ద్వారా వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు.
ఫోన్ డంప్.. డిజిటల్ ఫోరెన్సిక్స్లో ఉపయోగించే ప్రక్రియ. ఇందులో ఒక మొబైల్ ఫోన్లోని మొత్తం డేటా (కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, యాప్ సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ డేటా) బయటకు తీసి విశ్లేషిస్తారు. ముఖ్యంగా పోలీస్ విచారణలు, క్రిమినల్ కేసులు, సివిల్ లిటిగేషన్, లేదా కార్పొరేట్ దర్యాప్తుల్లో ఆధారాలు సేకరించడానికి ఉపయోగపడుతుంది.


