breaking news
Asim Munir
-
ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు .. జెఈఎం కమాండర్ వెల్లడి
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించారు.‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో జరిగిన నష్టాన్ని జైష్ ఎ మొహమ్మద్ (జెఈఎం) కమాండర్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత, అదే కమాండర్ షేర్ చేసిన మరొక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత ఆపరేషన్లో మరణించిన పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నతాధికారులకు సూచించారని చెప్పడం వినవచ్చు. 🚨🚨🚨 Exclusive:DG ISPR asked for linkage between Bhawalpur and Jaish-e-Muhammad His partner in terror Jaish commander Ilyas Kashmiri confirms: "GHQ (Pakistan Army chief) ordered his Generals to attend funerals of terrorists eliminated in Bahawalpur Jaish camp during… pic.twitter.com/MzA4KmYKxu— OsintTV 📺 (@OsintTV) September 16, 2025ఈ వీడియోలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హతమైన ఉగ్రవాదులకు నివాళులు అర్పించే దేశ నేతలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జైష్ ఎ మొహమ్మద్ పాత్ర ఉందని భారత్ ఇంకా ఆధారాలు సమర్పించలేదని ఆయన చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మే 7న బహవల్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారత క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం నాశనమయ్యిదని కశ్మీరీ అంగీకరించారు. కాగా అసిమ్ మునీర్ ఆదేశాల దరిమిలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, పోలీసు సీనియర్ అధికారులు ఉన్నత అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. -
దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు
న్యూఢిల్లీ: భారత్ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పాకిస్తాన్ను గురువారం భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నేతలు తరచూ పూర్తి నిర్లక్ష్యపూరిత, యుద్దోన్మాద, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తన గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేంకు భారత వ్యతిరేక వాణిని తరచూ వినిపిస్తోంది. మరోసారి ఏదైనా కవ్వింపు చర్యలతో దుస్సాహసానికి తెగిస్తే తీవ్రమైన పర్యావసా నాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తో భారత్ తన సత్తాను మీకు రుచి చూపించింది’’ అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించినవేళ ట్రంప్ భేటీ సమయంలో భారత్నుద్దేశిస్తూ మునీర్ హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. ‘‘ భారత్ కారణంగా పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే అణుబాంబు ప్రయోగానికికైనా సిద్ధం. మా దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని మాతోపాటు సమస్యల సుడిగుండంలోకి తీసుకెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు. మునీర్ వ్యాఖ్యలపై ఆనాడే భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘‘ అణు బెదిరింపులకు భయపడేది లేదు. పాతకాలంనాటి అణుబెదిరింపులు ఆపితే మంచిది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామనడం పూర్తి బాధ్యతారాహిత్యం. సైన్యం కనుసన్నల్లో పాలన వెళగబెట్టే పాక్ లాంటి దేశం నుంచి ఇలాంటి అణుబెదిరింపులు రావడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం’’ అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్లో అనుమతించాలన్న డిమాండ్ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్లో మునీర్ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
ప్రేలాపనలు ఆపు
న్యూఢిల్లీ: బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అని భారత ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. పొరుగు దేశంలో ప్రాణాంతక అణ్వాయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో భారత సైన్యం తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు సోమవారం తిప్పికొట్టాయి. అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచి్చపోవడం, నోరుపారేసుకోవడం, అసలు రంగు బయటపెట్టుకోవడం పాకిస్తాన్కు అలవాటేనని ఎద్దేవా చేశాయి. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేదే లేదని, అక్కడ సైన్యమే రాజ్యమేలుతోందని చెప్పడానికి అసిమ్ మునీర్ నోటిదురుసే తార్కాణమని వివరించాయి. మునీర్కు అమెరికాలో ఘనమైన స్వాగతం, గౌరవ మర్యాదలు లభించాయంటే దాని అర్థం ఆయన మౌనంగా ఉండొచ్చు లేదా అమెరికా అండతో పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, అధ్యక్షుడు కావొచ్చని తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ తదుపరి ప్రెసిడెంట్గా మారే పరిస్థితి కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అణ్వాయుధాలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పాయి. అణ్వాయుధాలు కలిగిన దేశం బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికాయి. వాటిని చూపించి ఇతరులను బెదిరిస్తామంటే అది సాధ్యం కాదని సూచించాయి. తమ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టంచేశాయి. పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని అసిమ్ మునీర్కు తేల్చిచెప్పాయి. మునీర్ వ్యాఖ్యలను అమెరికా ఆమోదిస్తోందా? ‘‘పాకిస్తాన్లో అణ్వాయుధాల బటన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కాకుండా సైన్యం చేతుల్లో చిక్కుకుంది. దక్షిణాసియాలో అణు అస్థిరతకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. అసిమ్ మునీర్ వాగుడు దీనినే సూచిస్తోంది. అమెరికా గడ్డపై ఆయన అనుచితంగా మాట్లాడారు. ఈ బాధ్యతరహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తోందా? అణ్వాయుధ ఘర్షణలకు తెరపడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా కోరుకుంటున్నారా? ఆయన వైఖరి ఏమిటి? మునీర్ వ్యాఖ్యలకు ట్రంప్ సర్కార్ బాధ్యత వహిస్తుందా?’’ అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నించాయి.