breaking news
Asim Munir
-
చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు
అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్హౌస్కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్హౌస్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్కి అవసరమైంది. పైగా.. ట్రంప్కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్ను టార్గెట్గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్ను వైట్హౌస్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్లో కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!పాకిస్థాన్లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. - హెచ్.కమలాపతిరావుఇదీ చదవండి:చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..! -
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??.. పీటీఐ వర్గాలు, ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్బాజ్ షరీఫ్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్ ఖాన్ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్ సెల్లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది. ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్కు కేటాయించిన ఖైదీ నెంబర్) కనిపిస్తున్నాయి.నాటి నుంచి.. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.ములాఖత్లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్ కెనన్లతో చెదరగొట్టారు.భారత్ రియాక్షన్ ఇదే..ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు. ఖాన్ కొడుకులు లండన్లో..ఇమ్రాన్ ఖాన్కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్స్మిత్ బ్రిటిష్ జర్నలిస్గ్. 1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్ను ఖాన్ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. 2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్తో పాటు అరెస్ట్ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
పాక్ సీడీఎఫ్గా మునీర్ ప్రసంగం.. భారత్కు హెచ్చరికలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై కవ్పింపు చర్యలకు దిగింది. పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా నియమితుడైన తర్వాత తన తొలి ప్రసంగంలోనే ఆసిమ్ మునీర్.. భారత్కు హెచ్చరిక జారీ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ప్రతీకార చర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే, పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా ఆసిమ్ మునీర్ను షహబాజ్ షరీఫ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, మునీర్ సోమవారం తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో రక్షణ దళాల ప్రధాన కార్యాలయ స్థాపన చారిత్రాత్మకమైనది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏకీకృత చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాయుధ దళాలు యుద్ధానికి కొత్త అవసరాలకు అనుగుణంగా ఉండాలి. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి పాకిస్తాన్ ప్రతీచర్య తీవ్రంగా ఉంటుంది. పాక్ చాలా కఠినంగా స్పందిస్తుంది. కాబట్టి భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం పనితీరుపై మునీర్ ప్రశంసలు కురిపించారు. Mere Aziz Humwatano!After deep consultation with myself, as Field Marshal, I am proud to announce the selection of the most qualified candidate for the post of Chief of Defence Forces i.e. myself.Proud of myself for this smooth transfer of power! pic.twitter.com/XYUCZWPbfd— Field Marshal Syed Asim Munir's Ego (@JungjooGernail) December 8, 2025మునీర్ కోసం 27వ రాజ్యాంగ సవరణ..ఇదిలా ఉండగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. -
పాక్ సంచలనం నిర్ణయం.. మునీర్కు కీలక బాధ్యతలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఆ దేశ ప్రభుత్వం ఉన్నత పదవిని కట్టబెట్టింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారులు లభించే అవకాశం ఉంది.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. మునీర్కు స్పెషల్ హోదా..ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్ అయ్యారు. దీంతో, పాకిస్తాన్ పలు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తిగా మునీర్ రికార్డులోకి ఎక్కారు. అయితే, సీడీఎఫ్గా ఆసిమ్ మునీర్ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ కావాలనే ఈ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
పాక్తో ఇంకా సంబంధాలెందుకు?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి. -
అఫ్గాన్తో ఉద్దేశపూర్వకంగా మునీర్ వైరం
లాహోర్: పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ధ్వజమెత్తారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్ ఉర్దూలో ట్విట్టర్లో పోస్టు చేశారు.పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..‘ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్’ (ఇస్లామిక్ ఫైటర్) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్ ఆరోపించారు. డ్రోన్ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్ నుండి బహిష్కరించారు. డ్రోన్ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్ పేర్కొన్నారు. జనరల్ మునీర్ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. మునీర్ ఆదేశాలతోనే నిర్బంధంమునీర్ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు. -
ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యక్ష నరకం!
పొరుగు దేశం భారత్తో ఇమ్రాన్ ఖాన్ ఏనాడూ కయ్యానికి కాలు దువ్వలేదని.. పైగా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే అడుగులు వేశాడని ఆయన సోదరి అలీమా ఖాన్ అంటున్నారు. పాక్ మాజీ ప్రధాని భద్రతపై పుకార్లు షికార్లు చేయడంతో.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆయన కుటుంబ సభ్యుల్ని ములాఖత్కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు.అసిమ్ మునీర్ పాక్తో యుద్ధం జరగాలని ఆశించారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం దోస్తీ కోసం తీవ్రంగా ప్రయత్నించారని ఆమె అన్నారు. ఈ క్రమంలో మునీర్పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఇమ్రాన్ ఖాన్ స్వేచ్ఛగా ఆలోచించేవాడు. అందుకే అధికారంలోకి రాగానే భారత్తో, అక్కడి అధికార పార్టీ బీజేపీకి స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేశాడు. కానీ, మునీర్ రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్. అందుకే భారత్తో కయ్యానికి కాలు దువ్వాడు. అతని ఆ ప్రయత్నంలో భారత్ మిత్రదేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి’’ అని అన్నారామె. ఇమ్రాన్ ఖాన్ను పాక్ జాతి సంపదగా అభివర్ణించిన అలీమా.. చెర నుంచి విడిపించేందుకు పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.ఒంటరిగా చిన్న సెల్లో బంధించారు. ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. బయటకు కూడా రానివ్వడం లేదు. సరైన తిండి పెట్టడం లేదు. మందులూ అందించడం లేదు. మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నారు. జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి అసిం మునీర్ కారణం. పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ఖాన్ అంటే భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయనకు పాక్ ప్రజల మద్దతు ఉంది కాబట్టి. ఇలాంటి చర్యల ద్వారా ఆయన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలనుకుంటున్నారు. కానీ, ఎంత అణిచివేస్తే అంత పెద్ద ఉద్యమం పుడుతుంది అని అలీమా సదరు మీడియా సంస్థతో అన్నారు.మునీర్తో చెడింది అక్కడే..2019లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయంలో ఆనాడు ఐఎస్ఐ డైరెకటర జనరల్గా ఉన్న మునీర్.. అతిగా ఆసక్తి చూపించారు. ఇది నచ్చని ఇమ్రాన్ఖాన్.. మునీర్ను పదవీ నుంచి తొలగించాడు. ఇది సాధారణంగానే ఇమ్రాన్ ఖాన్పై పగను పెంచుకునేలా చేసింది.పలుకేసుల్లో శిక్ష పడడంతో ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియా జైల్లో ఉంటున్నారు. అయితే.. నెల రోజుల నుంచి ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చివరి సందేశంలో ఆయన మునీర్పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలను ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన జైల్లోనే మరణించారని.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.. అనారోగ్యం బారిన పడ్డారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈలోపు..షెహబాజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. మంగళవారం ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి ఉజ్మా ఖానుమ్ 20 నిమిషాలపాటు ఇమ్రాన్ ఖాన్తో ములాఖత్ అయ్యారు. జైల్లో ఆయన మానసికంగా నరకం అనుభవిస్తున్నారని అన్నారామె. ఇది పీటీఐ వర్గాలకు తీవ్రాగ్రహం తెప్పించింది.ఇండియా-పాక్ ఉద్రిక్తతలుఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసింది భారత సైన్యం. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మెరుపు దాడులు నిర్వహించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నేలమట్టం చేసింది.Aleema Khanum, sister of Imran Khan, claims that her brother represents 90% of the people of Pakistan so by isolating him they are suppressing the people of Pakistan.Watch the full interview with @SkyYaldaHakim ⬇️https://t.co/YOYuCbPbZj📺 Sky 501, Virgin 602 and YouTube pic.twitter.com/oOacMmtHKP— Sky News (@SkyNews) December 2, 2025 -
ఇమ్రాన్ఖాన్ హత్య?
ఇస్లామాబాద్: రాజకీయ హత్యలకు పెట్టింది పేరైన పాకిస్తాన్లో మరో మాజీ ప్రధాని రక్తం చిందిందా? పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) సారథి, అలనాటి మేటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? రాజకీయ నిర్బంధానికి గురై 2023 నుంచీ జైల్లోనే మగ్గుతున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారా? గత జనవరి నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉంటున్న 72 ఏళ్ల ఇమ్రాన్ను అక్కడే సైలెంట్గా చంపేశారంటూ అఫ్గాన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హాండిల్ ఎక్స్లో పెట్టిన పోస్టు బుధవారం పెను దుమారమే రేపింది. అత్యంత విశ్వసనీయ వర్గాలే తమకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు అది పేర్కొంది. దాంతో చూస్తుండగానే సోషల్ మీడియా అంతా ఈ వార్తలతోనే ఊగిపోయింది. పాక్కు చెందిన పలు సైట్లు కూడా ఇమ్రాన్ కుటుంబీకులు, పీపీపీ నేతలను ఉటంకిస్తూ ఇదే విషయాన్ని ప్రచారంలో పెట్టాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణగానీ, ఖండన గానీ వెలువడకపోవడం గమనార్హం. దాంతో పాక్వ్యాప్తంగా ఇమ్రాన్ అభిమానులు, పీపీపీ కార్యకర్తలు, నేతలు వీధుల్లోకి వచ్చి ఆందోళన బాట పట్టారు. అడియాలా జైలును ముట్టడించే ప్రయత్నం చేశారు. జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని ఇమ్రాన్ గత జూలైలో ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్తో కలిసి తనను ఏదో చేసేందుకు ఒక కల్నల్ రంగంలోకి దిగినట్టు పేర్కొన్నారు. తనకు ఏమన్నా అయితే ఆర్మీ చీఫ్ సీఎం మునీర్నే అందుకు బాధ్యున్ని చేయాలని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపు నిచ్చారు. జైలు అధికారులు తనను విపరీతంగా వేధిస్తున్నా రని ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను కలిసేందుకు తమను అనుమతించడం లేదని బుధవారం ఆయన కుటుంబీకులు ఆరోపించిన కాసేపటికే ఇలా హత్య వార్త ప్రచారంలోకి వచ్చింది. పాక్ సైన్యమే ఆయన్ను పొట్టన పెట్టుకుందంటూ ఎక్స్ సహా అన్ని సోషల్ సైట్లలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. పైగా ఇమ్రాన్ను చూపించాలంటూ జైలు వెలుపల ధర్నాకు దిగిన ఆయన సోదరీమణులను పోలీసులు కొట్టి వెళ్ళగొట్టారన్న వార్తలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రధానిగా ఉంటూ పాక్లో అత్యంత శక్తిమంతమైన సైన్యంతో పెట్టుకున్న కొద్ది రోజులకే ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం తెలిసిందే. ఆ వెంటనే పలు అవినీతి ఆరోపణలపై ఆయన జైలుకెళ్లారు. తర్వాత ఒక్కొక్క కేసులో ఆయనకు శిక్ష పడుతూ వచ్చింది. Reports are now surfacing from inside the prisons of PUnjabi Pakistan that Imran Khan, who was being held in custody, has been killed by Asim Munir and his ISI administration according to several news outlets. If this information is confirmed to be true, it marks the absolute end… pic.twitter.com/SbbVB5uJll— Ministry of Foreign Affairs Baluchistan (@BaluchistanMFA) November 26, 2025 -
ఇండియాకు మునీర్ బెడద తప్పదా?
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుతం ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణపై చర్చిస్తోంది. ఈ సవరణ 243వ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి దేశ సాయుధ దళాలపై నియంత్రణ, ఆధిపత్యానికి సంబంధించి మౌలికంగా కొత్త రూపు నివ్వనుంది. దేశ రాజకీయ రంగస్థలంపై సైన్యానికున్న పట్టును దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, ఆ చర్చ చాలావరకు నిరుపయోగమైనదే అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత, పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి అసీమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో ఆయన సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్ఠపరచుకుంటున్నారు. పౌర ప్రభుత్వ–సైనిక సంబంధాలలో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది. తక్కెడలో సైన్యం వైపు బరువు మరింత పెరిగేటట్లు మునీర్ చూసుకుంటున్నారు. పదాతి దళానికే పెద్ద పీటప్రతిపాదిత రాజ్యాంగ సవరణ పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఉంది. త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎఫ్) పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది. సీడీఎఫ్గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది. ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతోంది. సీడీఎఫ్కు వీలు కల్పించేందుకు, చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ (సి.జె.సి.ఎస్.సి.) పదవిని త్వరలో రద్దు చేయనున్నారు. సంయుక్త కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా రిటైరవడం, ఆ పదవి రద్దవడం ఒకేసారి జరగనున్నాయి. ఐదు నక్షత్రాల ర్యాంకులు పొందిన సైనిక అధికారులకు ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ వంటి సైనిక బిరుదులను ప్రదానం చేయడం అసాధా రణం ఏమీ కాదుకానీ, అటువంటివారిని అభిశంసన ద్వారా తప్ప వేరే విధంగా తొలగించడానికి వీలు లేకపోవడం పాక్లో కనిపించే విచిత్రమైన అంశం. అన్ని అణు, వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ (సి.ఎన్.ఎస్.సి.)గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది. ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు, సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాన మంత్రి నియమిస్తారు. సూటిగా చెప్పాలంటే, దానిపై నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది. వీసమెత్తు ప్రతిఘటన లేకుండా, పాక్లో బాహాటంగా, ఇలా అధికారం కేంద్రీకృతం కావడం, పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా, ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ పరిణామాలు పాక్, భారత్ రెండింటిపైనా గణనీయమైన ప్రభా వాన్ని చూపనున్నాయి. అనూహ్యంగా ఎదిగిన మునీర్పాక్ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా–ఉల్–హక్ తర్వాత, తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారు. జియా కంటే కూడా మునీరే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడనుకోవాలి. సైనిక తిరుగుబాటు మాట లేకుండానే ఆయన మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసీమ్ అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆయన 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యారు.హిందువులు, ముస్లింలు కలసి ఎన్నడూ సహజీవనం సాగించలేరంటూ వ్యాఖ్యానించి, హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తల కెక్కారు. ఘోరమైన పహల్గామ్ దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఆయన నోటి నుంచి ఆ ప్రేలాపనలు వెలువడ్డాయి.పాక్లో అడుగుజాడలున్న ఉగ్రవాదులు పహల్గామ్లో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో, పాక్పై భారత్ దాడులను నిర్వ హించింది. ఆ స్వల్పకాలిక సమరంలో, తాను 1971 మాదిరి విజ యాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగాండా ప్రారంభించింది. దాన్ని ఊతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్ఠపరచుకుని, ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ గడించారు. పాక్ను ట్రంప్కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించారు. సౌదీ అరేబి యాతో రక్షణ ఒప్పందాన్ని ఆధికారికం చేసుకోవడంతో సహా పశ్చి మాసియాకు స్నేహహస్తాన్ని చాచే వ్యూహాత్మక ప్రణాళికను రచించడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో, మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగించినట్లవుతుంది. త్రివిధ దళాలు ఆయన కనుసన్న ల్లోనే మెలుగుతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వాన్నంగా తయారైన పరిస్థితుల్లో, తెలివిగా పావులు కదుపుతూ, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్లో ఆయనకు ఎదురు చెప్పగలవారు లేరు. ప్రస్తుత సవరణ, వైమానిక, నౌకా దళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆ రెండు దళాలకు రుచించకపోవచ్చు. సైనిక ప్రధానాధికారే ఎల్లప్పుడూ సి.ఎన్.ఎస్.సి.గా ఉంటాడని నిర్దేశించడాన్ని అవి వ్యతిరేకించవచ్చు. క్షిపణులు సాధారణంగా నౌకాదళం వద్ద ఉంటాయి. ఇపుడీ సవరణతో మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి. సైన్యానికి ప్రస్తుతం ఉన్న పైచేయిని ధ్రువపరచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండవచ్చు. కానీ, ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా, రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది. కనుక, భవిష్యత్ నాయకులకు, దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిణమించవచ్చు. భారత్ ద్వేషమే ఆయుధంభారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇపుడు మరిన్ని అధికారాలున్న మునీర్ కింద పనిచేసే సైన్యం, భారత్కు గణనీ యమైన సవాల్గా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. చిర కాలంగా, పాక్ సైన్యం దృష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది. అది ఇపుడు మరింత కేంద్రీకృతమవుతుంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్ళించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా, అది భారతదేశంపై యుద్ధానికి, లేదా ఘర్షణకు దిగవచ్చు. భారత్కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపు తారు. అది వారిని ఏకం చేసే ఆయుధంగానూ పనికొస్తుంది. కనుక, మునీర్ ఎత్తుగడలను భారత్ తప్పనిసరిగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. హ్యాపీమ్యాన్ జాకబ్ వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్’ ఫౌండర్–డైరెక్టర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రాజ్యాంగ సవరణపై పాక్లో ఆందోళనలు
ఇస్లామాబాద్: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల చీఫ్గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్ మార్షల్గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్లో ఓటింగ్ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు బిగ్ షాక్.. మగాడివైతే యుద్ధం చేయ్ అంటూ తాలిబన్లు..
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన కమాండర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను టార్గెట్ చేసి చాలెంజ్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మునీర్కు నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అలాగే, పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ కమాండర్ కాజిమ్ వీడియోలో మాట్లాడుతూ నేరుగా ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సవాలు విసిరాడు. ఇందులో..‘మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఎందుకు?. వారికి బదులుగా పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు నిజంగా దమ్ముంటే.. మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి. అతను నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయ్ అని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో అక్టోబర్ 8న కేపీ ప్రావిన్స్లో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలు విడుదల చేసింది. TTP has released exclusive footage from its assault on Jogi military fort in Dogar, Kurram, showcasing seized Pak Army vehicles, weapons & ammunition.Among those leading the attack was top commander Kazim.Pak Army's monsters turn their guns on them. #FailedStatePakistan@kscs58 pic.twitter.com/9UW17xWQvJ— Rashtriya Rifles (@DeltaRR2000) October 23, 2025ఇక, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ నెల 21న కమాండర్ కాజిమ్ ఆచూకీ తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల (పీకేఆర్) రివార్డును ప్రకటించింది. అయితే, అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రంలో టీటీపీ.. పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్ సైనికులు చనిపోయారని టీటీపీ పేర్కొంది. ఈ దాడిలో భాగంగా తాము స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి, వాహనాలను చూపించింది. మరోవైపు, టీటీపీ దాడిలో 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం అంగీకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, టీటీపీ దాడులు ఏమాత్రం తగ్గలేదు. 🚨 Alert:The #KPK government has placed a ₹10 crore Bounty on banned TTP commander Kazim from Kurram.He is wanted for attacks on Lt. Col. Junaid Arif, Major Tayyab Rahat, a military convoy to Parachinar, Shia passengers, and an assassination attempt on DC Kurram Javedullah pic.twitter.com/gSBuUzt7nj— Eye (@Eye59763563) October 21, 2025పాక్లో టీటీపీ దడ..తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్ పెంచిన పెరటి మొక్క. ఇది అనేక తాలిబాన్ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. 2007లో బజావుర్, స్వాట్, ఖైబర్ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్లోని మిలిటరీ, రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి. దీని వెనుక అల్ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా, ఒసామా బిన్ లాడెన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది. ఆఫ్గాన్ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్ పాక్ మధ్య భావజాల సమానత ఉన్నా, లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంతోపాటు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్ శరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, పాకిస్తాన్–ఆఫ్గాన్ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి.టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆప్ఘనిస్థాన్లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది. ఇటీవలే కాబూల్ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత అక్టోబరు 11న పాక్, ఆఫ్గన్ బార్డర్లో సైనిక ఘర్షణ పెరిగింది. తాలిబన్ల దాడుల్లో పెద్దసంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్లో పర్యటించడం గమనార్హం. -
రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ తమను ఏమాత్రం రెచ్చగొట్టినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. తమను రెచ్చగొడితే వెంటనే తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు. నేటి అణ్వాయుధాల వాతావరణంలో యుద్ధాలకు తావులేదని, ఈ విషయంలో భారత సైనికాధికారులు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం భారత్తో జరిగిన సైనిక ఘర్షణలో అద్భుతమైన సామర్థ్యాలు ప్రద ర్శించామని, లక్ష్యాలను ఛేదించామని అన్నారు. కేవలం అంకెల్లో గొప్పగా కనిపిస్తున్న ప్రత్యరి్థపై విజయం సాధించామని స్పష్టంచేశారు. భారత్ను అస్థిరపర్చడానికి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుటోందని అసిమ్ మునీర్ ఆరోపించారు. పిడికెడు మంది ఉగ్రవాదులు తమను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్పై దాడులు చేస్తున్నవారిని మట్టిలో కలిపేస్తామని పరోక్షంగా తెహ్రీక్–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ని హెచ్చరించారు. -
అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు!
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. పాకిస్తాన్లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది. పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది. అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్కు కీలకం. పాకిస్తాన్తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు(Asim Munir) ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు(Donald Trump) అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మునీర్కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మునీర్ బ్రాండెడ్ సేల్స్ పర్సన్గా వ్యవహరించారని పాకిస్తాన్ సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.పాకిస్తాన్ పార్లమెంట్లో తాజాగా సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మన దేశానికి చెందిన అరుదైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు. పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్కు చూపించారు. మునీర్ ఒక సేల్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇక, పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా?. మునీర్ ఏ హోదాలో.. ఏ చట్టం కింద ఇలా చేశారు. ఇది నియంతృత్వం కాదా?. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది పార్లమెంటును ధిక్కరించడం కాదా? అని ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఎదురుదెబ్బ తగిలింది.⚡ Huge Embarrassment For Pakistan’s 'Failed' Marshal Asim MunirPakistani senator Aimal Wali Khan has criticised Pakistan COAS Asim Munir inside the Pakistani Parliament over selling rare earth minerals in a briefcase to US President Donald Trump. "What a Joke" he says.He… pic.twitter.com/YbiXZoN1Da— OSINT Updates (@OsintUpdates) October 1, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుట్టలో వేసుకోవడానికి పాక్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pak Army Chief Asim Munir), ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ఓ చెక్కపెట్టెను బహూకరించారు. దానిలో పాక్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టెలోని రంగురాళ్లను చూపుతూ ఏదో చెబుతుండగా.. ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్లు అందులో ఉంది. అనంతరం మునీర్ మాట్లాడుతూ..‘పాకిస్తాన్ (Pakistan) వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది. దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది. అతి త్వరలోనే పాక్ సుసంపన్న సమాజాల్లో ఒకటిగా మారుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
అతిపెద్ద యుద్ధం ఆపేశా!
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆ రెండు దేశాల నడుమ అతిపెద్ద యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి తేల్చిచెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పారు. మంగళవారం మిలటరీ కమాండర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తనను ప్రశంసించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అసిమ్ మునీర్ మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. అసిమ్ మునీర్ పాకిస్తాన్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ట్రంప్ తేల్చిచెప్పారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశానని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా భారత్–పాక్ల యుద్ధమే ఉందన్నారు. భారత్, పాక్ ఘర్షణలో ఏడు యుద్ధ విమానాలు నేలకూలాయని వెల్లడించారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. మరోవైపు ఆపరేషన్ సిందూర్కు విరామం ఇవ్వడం వెనుక అమెరికా ప్రమేయం లేదని, పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చి వేడుకోవడం వల్లే వైమానిక దాడులు నిలిపివేశామని భారత ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు .. జెఈఎం కమాండర్ వెల్లడి
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించారు.‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో జరిగిన నష్టాన్ని జైష్ ఎ మొహమ్మద్ (జెఈఎం) కమాండర్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత, అదే కమాండర్ షేర్ చేసిన మరొక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత ఆపరేషన్లో మరణించిన పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నతాధికారులకు సూచించారని చెప్పడం వినవచ్చు. 🚨🚨🚨 Exclusive:DG ISPR asked for linkage between Bhawalpur and Jaish-e-Muhammad His partner in terror Jaish commander Ilyas Kashmiri confirms: "GHQ (Pakistan Army chief) ordered his Generals to attend funerals of terrorists eliminated in Bahawalpur Jaish camp during… pic.twitter.com/MzA4KmYKxu— OsintTV 📺 (@OsintTV) September 16, 2025ఈ వీడియోలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హతమైన ఉగ్రవాదులకు నివాళులు అర్పించే దేశ నేతలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జైష్ ఎ మొహమ్మద్ పాత్ర ఉందని భారత్ ఇంకా ఆధారాలు సమర్పించలేదని ఆయన చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మే 7న బహవల్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారత క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం నాశనమయ్యిదని కశ్మీరీ అంగీకరించారు. కాగా అసిమ్ మునీర్ ఆదేశాల దరిమిలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, పోలీసు సీనియర్ అధికారులు ఉన్నత అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. -
దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు
న్యూఢిల్లీ: భారత్ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పాకిస్తాన్ను గురువారం భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నేతలు తరచూ పూర్తి నిర్లక్ష్యపూరిత, యుద్దోన్మాద, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తన గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేంకు భారత వ్యతిరేక వాణిని తరచూ వినిపిస్తోంది. మరోసారి ఏదైనా కవ్వింపు చర్యలతో దుస్సాహసానికి తెగిస్తే తీవ్రమైన పర్యావసా నాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్తో భారత్ తన సత్తాను మీకు రుచి చూపించింది’’ అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించినవేళ ట్రంప్ భేటీ సమయంలో భారత్నుద్దేశిస్తూ మునీర్ హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. ‘‘ భారత్ కారణంగా పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే అణుబాంబు ప్రయోగానికికైనా సిద్ధం. మా దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని మాతోపాటు సమస్యల సుడిగుండంలోకి తీసుకెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు. మునీర్ వ్యాఖ్యలపై ఆనాడే భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘‘ అణు బెదిరింపులకు భయపడేది లేదు. పాతకాలంనాటి అణుబెదిరింపులు ఆపితే మంచిది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామనడం పూర్తి బాధ్యతారాహిత్యం. సైన్యం కనుసన్నల్లో పాలన వెళగబెట్టే పాక్ లాంటి దేశం నుంచి ఇలాంటి అణుబెదిరింపులు రావడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం’’ అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్లో అనుమతించాలన్న డిమాండ్ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్లో మునీర్ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
ప్రేలాపనలు ఆపు
న్యూఢిల్లీ: బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అని భారత ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. పొరుగు దేశంలో ప్రాణాంతక అణ్వాయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో భారత సైన్యం తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు సోమవారం తిప్పికొట్టాయి. అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచి్చపోవడం, నోరుపారేసుకోవడం, అసలు రంగు బయటపెట్టుకోవడం పాకిస్తాన్కు అలవాటేనని ఎద్దేవా చేశాయి. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేదే లేదని, అక్కడ సైన్యమే రాజ్యమేలుతోందని చెప్పడానికి అసిమ్ మునీర్ నోటిదురుసే తార్కాణమని వివరించాయి. మునీర్కు అమెరికాలో ఘనమైన స్వాగతం, గౌరవ మర్యాదలు లభించాయంటే దాని అర్థం ఆయన మౌనంగా ఉండొచ్చు లేదా అమెరికా అండతో పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, అధ్యక్షుడు కావొచ్చని తెలిపాయి. ఫీల్డ్ మార్షల్ తదుపరి ప్రెసిడెంట్గా మారే పరిస్థితి కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అణ్వాయుధాలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పాయి. అణ్వాయుధాలు కలిగిన దేశం బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికాయి. వాటిని చూపించి ఇతరులను బెదిరిస్తామంటే అది సాధ్యం కాదని సూచించాయి. తమ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టంచేశాయి. పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని అసిమ్ మునీర్కు తేల్చిచెప్పాయి. మునీర్ వ్యాఖ్యలను అమెరికా ఆమోదిస్తోందా? ‘‘పాకిస్తాన్లో అణ్వాయుధాల బటన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో కాకుండా సైన్యం చేతుల్లో చిక్కుకుంది. దక్షిణాసియాలో అణు అస్థిరతకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. అసిమ్ మునీర్ వాగుడు దీనినే సూచిస్తోంది. అమెరికా గడ్డపై ఆయన అనుచితంగా మాట్లాడారు. ఈ బాధ్యతరహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తోందా? అణ్వాయుధ ఘర్షణలకు తెరపడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా కోరుకుంటున్నారా? ఆయన వైఖరి ఏమిటి? మునీర్ వ్యాఖ్యలకు ట్రంప్ సర్కార్ బాధ్యత వహిస్తుందా?’’ అని భారత ప్రభుత్వ వర్గాలు ప్రశ్నించాయి.


