ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. భారత్పై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తాజాగా బయటకు వచ్చింది. మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో కశ్మీర్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జైషే ఉగ్రవాది మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ఆసిమ్ మునీర్ ‘ఘజ్వా-ఎ-హింద్’గా అభివర్ణించాడని అన్నాడు. యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్ను విముక్తి చేస్తామని చెప్పాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
అయితే, భారత్పై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘ఘజ్వా ఎ హింద్’ సూచిస్తుంది. మరోవైపు.. జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారి మధ్య సంబంధాలు మాత్రం ఇలా బయటకు వస్తున్నాయి. ఈ సమావేశంలో కొత్తగా చేరిన మిలిటెంట్లు కూడా పాల్గొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పాకిస్తాన్లోని బహిరంగ వేదికలను పదేపదే ఉపయోగించుకుని జిహాద్ను కీర్తిస్తున్నారు. భారత్లో ఘర్షణను మతపరమైన కోణంలో చిత్రీకరిస్తున్నారు. తరచుగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉన్న సమక్షంలోనే ఇది జరుగుతోంది.
ఇక, గత సంవత్సరం ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తరువాత భారత్.. ఉగ్రవాదంపై కఠినమైన దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్, ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఎయిర్బేస్లపై దాడి చేసి దాయాదిని కోలుకోలేని దెబ్బకొట్టింది. అలాగే, పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు సైతం విధించింది.


