పుదుచ్చేరిలో విజయ్‌ సభ.. తుపాకీ కలకలం | Suspicious Man enter Into actor Vijay rally in Puducherry | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో విజయ్‌ సభ.. తుపాకీ కలకలం

Dec 9 2025 10:59 AM | Updated on Dec 9 2025 11:18 AM

Suspicious Man enter Into actor Vijay rally in Puducherry

చెన్నై: తమిళనాడులో కరూర్‌ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్‌ విజయ్ నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విజయ్‌ సభ నేపథ్యంలో సభా వేదిక వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు వ్యక్తిని టీవీకే పార్టీ నేతగా పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్‌పో గ్రౌండ్‌ (Expo ground) నేడు విజయ్‌ బహిరంగ సభ జరుగుతుంది. కరూర్‌ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్‌ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తుపాకీతో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా అధికారులు గుర్తించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

మరోవైపు.. పుదుచ్చేరి పోలీసులు విజయ్‌ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. విజయ్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్‌ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్‌ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement