కేరళ సీఎం రేసులో లేను | Congress Mp ShashiTharoor has ruled himself out of the Kerala chief ministerial race | Sakshi
Sakshi News home page

కేరళ సీఎం రేసులో లేను

Mar 20 2026 4:28 AM | Updated on Mar 20 2026 4:28 AM

Congress Mp ShashiTharoor has ruled himself out of the Kerala chief ministerial race

అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అవుతారు  

నేను పోటీ చేయడంలేదు.. సీఎం అయ్యే ప్రసక్తే లేదు  

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌ స్పషీ్టకరణ  

ఎన్నికల్లో యూడీఎఫ్‌ విజయం తథ్యమని ధీమా  

రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రచారం చేస్తానని వెల్లడి  

న్యూఢిల్లీ:  కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలయ్యింది. పార్టీలు గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌), సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) మధ్య ప్రధాన పోటీ సాగుతోంది. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని ఆయన తేలి్చచెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు సీఎంగా ఎన్నికయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన నాయకుడే సీఎంగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని సూచించారు. శశి థరూర్‌ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం లేదు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండాపోయిందన్నారు. కేరళ ఎన్నికల్లో తన పాత్ర మిక్స్‌డ్‌ బ్యాగ్‌ లాంటిదని చెప్పారు. రాష్ట్రమంతటా తిరుగుతూ తమ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని సంకేతాలిచ్చారు. యూడీఎఫ్‌ విజయమే లక్ష్యంగా పని చేస్తానని ఉద్ఘాటించారు.  

ఎల్‌డీఎఫ్‌పై గూగ్లీలు విసురుతున్నాం  
రాష్ట్రంలో కూటమి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలంటూ తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవల ఆదేశించారని శశి థరూర్‌ వివరించారు. క్షేత్రస్థాయిలో రాహుల్‌ ఆదేశాలను పాటిస్తున్నామని, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా, ఎన్నికల్లో యూడీఎఫ్‌కు 85 నుంచి 100 స్థానాలు లభిస్తే చాలా సంతోíÙస్తానని థరూర్‌ వ్యాఖ్యానించారు. తమకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎల్‌డీఎఫ్‌పై గూగ్లీలు విసురుతున్నామంటూ క్రికెట్‌ పరిభాషలో చెప్పారు. వామపక్ష కూటమిని కచి్చతంగా ఇంటికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అభ్యరి్థని ఎన్నికల కంటే ముందు ప్రకటించే విధానాన్ని వ్యక్తిగతం తాను సమర్థిస్తానని చెప్పారు. కేరళలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు, అజెండా, లోగోతోనే గెలుస్తామని అన్నారు. సీఎం అభ్యరి్థని ప్రకటించకపోయినా విజయావకాశాలపై ఎలాటి ప్రభావం ఉండదని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎం అభ్యరి్థని ఎంపిక చేస్తుందన్నారు.  

అస్సాంలో ఆ నిర్ణయమే కరెక్టు  
దేశంలో ఎన్నికల పరిణామ క్రమాన్ని చాలా ఏళ్లుగా దగ్గరగా గమనిస్తున్నానని థరూర్‌ తెలిపారు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రాజకీయా పార్టీలు అధ్యక్ష తరహా విధానాన్ని పాటిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు కూడా అదే తరహాలో జరుగుతున్నాయని పేర్నొన్నారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల కోసం పార్టీలు తమ అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్నాయని గుర్తుచేశారు. కేరళలో యూడీఎఫ్‌కు సీఎం అభ్యర్థి లేకపోవడం అందరికీ వింతగా కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందన్నారు.

 ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కాంగ్రెస్‌కు ఓటర్లు ఉన్నారని చెప్పారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఇదే సూత్రం అన్నిచోట్లా పని చేయదని అభిప్రాయపడ్డారు. అస్సాంలో గౌరవ్‌ గొగోయ్‌ని సీఎం అభ్యరి్థగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ అలాంటి నిర్ణయమే సముచితమని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థులను ముందే ప్రకటించాల్సిన అవసరం రావొచ్చన్నారు. కేరళలో పదేళ్ల ఎల్‌డీఎఫ్‌ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని శశి థరూర్‌ చెప్పారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్‌కు పట్టం గట్టడం తథ్యమని పేర్కొన్నారు.  

ఆర్భాటాలు సహాయపడవు
ఇరాన్‌ యుద్ధంపై ప్రభుత్వ వైఖరికి శశి థరూర్‌ మద్దతు
కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ మరోసారి తన పార్టీతో విభేదించారు. అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరిని సమరి్థంచారు. ప్రభుత్వ మౌనం బాధ్యతాయుతమైన రాజనీతిజ్ఞతని అభివరి్ణంచారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సంఘర్షణను సమర్థించలేమని, సార్వ¿ౌమాధికారం, అహింస వంటి భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న సూత్రాలను ఇది ఉల్లంఘిస్తోందని థరూర్‌ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రభుత్వ సంయమనం వ్యూహాత్మక తెలివిని ప్రతిబింబిస్తుందన్నారు. ‘ఈ సందర్భంలో మౌనం పిరికితనం కాదు. ఇది మన జాతీయ ప్రయోజనాలకు, ఈ ప్రాంత వాస్తవాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని గంభీరంగా గుర్తించడమే’నని వ్యాఖ్యానించారు.  

ఖమేనీ హత్యపై ఆలస్యంగా సంతాపం తెలిపి దేశం తన స్పందనలో తడబడిందని థరూర్‌ పేర్కొన్నారు. అయితే, మౌనాన్ని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని ఆయన వాదించారు. విదేశాంగ విధానం ఒక విద్యా సదస్సు కాదని, పరిణామాలను పట్టించుకోకుండా ఖండించాలని పట్టుబట్టడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో నెహ్రూ, గాంధీ సూత్రాలను స్వీకరించి, అమలు చేయాలని థరూర్‌ వాదించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. అదే తర్కం ఈ రోజు కూడా వర్తిస్తుందని, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి, ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడికి కూడా ఇది వర్తిస్తుందని ఆయన జోడించారు. 

చంచల స్వభావి అయిన ట్రంప్‌ నాయకత్వంలో వ్యతిరేకత ఎదురైతే విరుచుకుపడే స్వభావం ఉన్న అమెరికా, మనదేశానికి నమ్మకమైన మిత్రదేశం కాదని హెచ్చరించారు. రక్షణ సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, చైనాకు ప్రతిఘటనగా నిలవడానికి భారత్‌కు అమెరికాతో స్థిరమైన సంబంధాలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. అన్ని పక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సంయమనం పాటించడంతో దేశం తన ప్రయోజనాలను కాపాడుకోగలదని ఆయన వాదించారు.  ఆయన వైఖరి తన పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉంది. కీలకమైన అంశాలపై థరూర్‌ ప్రభుత్వంతో ఏకీభవించడం ఇది మొదటిసారి కాదు.   గతంలో ప్రధాని మోదీ ఉగ్రవాద వ్యతిరేక అజెండానూ ప్రశంసించారు. ఆయన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి ఆగ్రహం తెప్పించడంతో పాటు, పార్టీ అధినేతలతో ఆయన సంబంధాలనూ మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement