హాఫ్‌ రేట్‌కే వందే భారత్‌ టికెట్లు! | Indian Railways Reacts After TC Vande Bharat Ticket Half Price Video Viral | Sakshi
Sakshi News home page

హాఫ్‌ రేట్‌కే వందే భారత్‌ టికెట్లు!

May 13 2026 7:37 AM | Updated on May 13 2026 7:53 AM

Indian Railways Reacts After TC Vande Bharat Ticket Half Price Video Viral

రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్‌ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్‌ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..

మరో వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. వందేభారత్‌ టికెట్‌ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్‌లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్‌ ఆన్‌లైన్‌లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. 

ఫ్లాట్‌ఫారమ్‌ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్‌ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్‌ ఉందని.. తన దగ్గర టికెట్‌ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్‌ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే..  రూ.700 విలువైన వందే భారత్ టికెట్‌ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. 

ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్‌ దానాపూర్‌ డివిజన్‌ పరిధిలో నడిచే వందే భారత్‌ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్‌లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.

రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్‌ఎం ఈ వైరల్‌ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్‌ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్‌సీటీసీ IRCTC వెబ్‌సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్‌ బుకింగ్‌) లభించవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement