సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు.
முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi
— Way2News Tamil (@way2news_) May 13, 2026
Video Source: Way2News Tamil
మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది.
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు.


