లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయ దిగ్గజం, దివంగత ములాయం సింగ్ యాదవ్ ద్వితీయ కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం తెల్లవారుజామున లక్నోలో కన్నుమూశారు. అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్, మే 13న అస్వస్థతకు గురికావడంతో లక్నోలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5:55 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రతీక్ మృతిపై సందేహాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పోస్ట్మార్టం నిర్వహించి, విష ప్రయోగం లాంటి కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
వార్తల్లో వైవాహిక జీవితం
ప్రతీక్ మరణం యూపీలో కలకలం రేపగా, ఆయన వైవాహిక జీవితం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2011లో అపర్ణ యాదవ్ను వివాహం చేసుకున్న ప్రతీక్, ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన భార్య అపర్ణ ఒక ‘స్వార్థపరురాలు’ అని, కేవలం కీర్తి ప్రతిష్టల కోసమే పాకులాడుతూ తన కుటుంబ బంధాలను నాశనం చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులు, సోదరునితో కూడా దూరం పెరగడానికి ఆమెనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆమె అతిపెద్ద అబద్ధాలకోరు’
అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అపర్ణకు వీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రతీక్ ప్రకటించారు. ఆమె ప్రవర్తన కారణంగా తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, తన జీవితంలో చూసిన అతిపెద్ద అబద్ధాలకోరు ఆమె అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకురాలిగా, ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అపర్ణపై భర్త చేసిన ఈ వ్యాఖ్యలు ములాయం కుటుంబంలో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, ఈ ఆరోపణలపై అపర్ణ గానీ, రాజకీయ పార్టీలు గానీ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు.
భార్యతో కలిసి సంతోషంగా..
విచిత్రమేమిటంటే, ఆ తీవ్రమైన ఆరోపణల తర్వాత కొద్దిరోజులకే వారి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించింది. ప్రతీక్ తన విడాకుల పోస్టులను తొలగించడమే కాకుండా, భార్యతో కలిసి సంతోషంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి బంధం మళ్లీ గాడిలో పడిందని అంతా భావిస్తుండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: అమెరికా కొలువుల స్కామ్.. భారత్లో మూలాలు?


