అమెరికా కొలువుల స్కామ్‌.. భారత్‌లో మూలాలు? | US ICE Crackdown 10000 Foreign Students Caught in Massive OPT Scam | Sakshi
Sakshi News home page

అమెరికా కొలువుల స్కామ్‌.. భారత్‌లో మూలాలు?

May 13 2026 10:10 AM | Updated on May 13 2026 10:10 AM

US ICE Crackdown 10000 Foreign Students Caught in Massive OPT Scam

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) భారీ షాక్ ఇచ్చింది. ఎఫ్-1 (ఎఫ్‌-1) వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కింద ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 10,000 మంది విద్యార్థులు నకిలీ కంపెనీల ఉచ్చులో ఉన్నట్లు దర్యాప్తులో తేలడం తీవ్ర సంచలనంగా మారింది.

ఓపీటీ అక్రమాల పుట్ట
ఐసీఈ డైరెక్టర్ టాడ్ ఎమ్ లియోన్స్ ఈ భారీ స్కామ్ వివరాలను వెల్లడిస్తూ, ఓపీటీ ప్రోగ్రామ్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుష్, ఒబామా హయాంలో కొద్ది మంది కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)ఆధ్వర్యంలో మొదలైన ఈ పథకం.. నేడు లక్షలాది మంది వలస కార్మికులకు అక్రమ దారిగా మారిపోయిందన్నారు. ట్రంప్, బైడెన్ పాలకుల సమయంలో ఈ నకిలీ ఉద్యోగాల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, అస్సలు ఉనికిలోనే లేని కంపెనీల్లో వేలాది విద్యార్థులు పనిచేస్తున్నట్లు కల్పిత ఆధారాలు సృష్టించారని ఆయన తెలిపారు. కేవలం టాప్ 25 ఓపీటీ యాజమాన్యాలను పరిశీలించగా, 10 వేల మంది విద్యార్థులు అనుమానాస్పద కంపెనీల్లో ఉన్నట్లు బయటపడిందని, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని లియోన్స్ అన్నారు.
 

తాళం వేసిన ఆఫీసులు.. గుట్టు రట్టు
దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వందలాది మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారని చెబుతున్న కంపెనీల చిరునామాలకు వెళ్లి చూడగా, అక్కడ కేవలం ఖాళీ భవనాలు, తాళం వేసిన తలుపులు మాత్రమే కనిపించాయి. ఒకే అడ్రస్‌పై పలు కంపెనీలు రిజిస్టర్ కావడం, ఏ ఒక్కరికీ లీజు అగ్రిమెంట్లు లేకపోవడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా అనుమానాస్పద నగదు లావాదేవీలు జరగడం మొదలైనవి అధికారులను విస్మయానికి గురిచేశాయి. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్‌ఎస్‌ఐ) బృందం టెక్సాస్‌లో ఇటీవల 18 ఓపీటీ వర్క్‌సైట్లపై దాడులు చేయగా, ఈ నకిలీ కంపెనీల వెనుక ఉన్న భారీ కుట్ర బట్టబయలైంది.
 

తీగ లాగితే ఇండియా డొంక
టెక్సాస్ దాడుల్లో బయటపడిన విషయాలు ఈ స్కామ్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక వర్క్‌సైట్‌లో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీటీ విద్యార్థులు ఉన్నారని యాజమాన్యం చెప్పగా, రికార్డుల్లో మాత్రం ఏకంగా 500 మంది ఉన్నట్లు తేలింది. అధికారుల ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని అక్కడి సిబ్బంది.. ఇండియాలో ఉన్న తమ హెచ్‌ఆర్ (హెచ్‌ఆర్‌) ప్రతినిధులను అడగాలంటూ దాటవేశారు. ఈ నెట్‌వర్క్ అంతా వెబ్‌సైట్లలో ఒకే విధమైన జాబ్ పోస్టింగులు ఇస్తూ, ముఠాగా ఏర్పడి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయింది.

ఇది కూడా చదవండి: నీట్ స్కామ్ @ 2026: తనిఖీల్లో చిక్కిన ‘సాల్వర్ గ్యాంగ్’

Advertisement
 
Advertisement
Advertisement