లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.
సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.

ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు.


