గల్ఫ్లో చిక్కుకున్న ఉమ్మడి కడప జిల్లా వాసులు
ఆందోళనలో బాధిత కుటుంబాలు
రాజంపేట : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం ఉమ్మడి కడప జిల్లా వాసులు లక్షలాదిమంది చిక్కుకుపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా వాసులు సుమారు రెండులక్షల మంది ఉన్నట్టు సమాచారం. ప్రవాసాంధ్రులు 12 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆయా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో బాంబుల వర్షం కురుస్తుండడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బంధువులకు చేరవేస్తున్నారు. జనావాసాల మధ్య క్షిపణులు, బాంబు దాడులు జరుగుతుండడంతో భయం గుప్పెట్లో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గదులకే పరిమితం
యుద్ధ వాతవరణం నేపథ్యంలో చాలామంది ప్రవాసాంధ్రులు (Telugu NRIs) స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సామగ్రితో విమానాశ్రయాలకు వెళ్లినా ఫలితం లేకపోయిందని సమాచారం. విమానాలు రద్దవడంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది. బాంబు దాడుల నేపథ్యంలో తమ గదులకే పరిమితమవుతున్నట్టు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాల అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది.

ప్రవాస భారతీయుల కోసం..
ప్రవాస భారతీయుల కోసం భారత రాయబార శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు గల్ఫ్దేశాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ఇప్పటికే వివిధ దేశాల్లో అత్యవసర హెల్ప్లైన్ (Helpline) నంబర్లను అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొటుంటే వెంటనే సంప్రందించాలని కూడా సూచించారు.
చదవండి: భారతీయులను రప్పించే ప్రయత్నాలు షురూ
దోహాలో ఉన్న మా కుమార్తెను క్షేమంగా తీసుకురండి
ప్రభుత్వానికి బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి
నరసన్నపేట: ఖతర్ రాజధాని దోహాలో తమ కుమార్తె బంకుపల్లి సంజనా చంద్ ఉందని, అక్కడ బాంబు దాడుల నేపథ్యంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సూరజ్ నగర్కు చెందిన బంకుపల్లి చంద్రశేఖర్, సుమబాల ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోహాలో తమ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని పేర్కొన్నారు.
జర్మనీ వెళ్తుండగా..
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వెంకటగౌతం కంపెనీ పనిపై జర్మనీ వెళ్తుండగా మధ్యలో ఖతార్ దేశ రాజధాని దోహాలో దిగి అక్కడ చిక్కుకుపోయాడు.


