ఏఐ ఆఫీసర్స్ | New generation of jobs in the job market | Sakshi
Sakshi News home page

ఏఐ ఆఫీసర్స్

Mar 9 2026 5:07 AM | Updated on Mar 9 2026 5:07 AM

New generation of jobs in the job market

జాబ్‌ మార్కెట్లో కొత్త తరం ఉద్యోగాలు 

వీటిని అందుకోవడానికి రెడీగా ఉండండి 

ఇందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి 

అంతర్జాతీయ నివేదిక వెల్లడి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్‌–కాలర్‌ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్‌ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. 

కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

మానవ శ్రమను భర్తీ చేయలేదు
కొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్‌) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్‌ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్‌ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 

1980ల్లో స్ప్రెడ్‌షీట్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్‌కీపింగ్‌ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. 

ఏఐ నిపుణుల కొరత.. 
మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ నిర్వహించిన గ్లోబల్‌ టాలెంట్‌ షార్టేజ్‌ సర్వే ప్రకారం.. భారత్‌లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్‌–4లో భారత్‌ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. 

ఏఐ లిటరసీ, ఏఐ మోడల్‌ డెవలప్‌మెంట్‌ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్‌ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్‌ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. 

రానున్న రోజుల్లో.. 
నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రిసెర్చ్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. 

అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్‌లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. 

ఎలాంటి ఉద్యోగాలంటే.. 
ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ’చీఫ్‌ ఏఐ ఆఫీసర్స్‌’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్‌’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్‌ పెరగనుంది. 

వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్‌ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్‌ అనలిస్ట్‌ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్‌ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్స్, స్మార్ట్‌ గ్రిడ్‌ అనలిస్ట్‌ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్‌ టూల్స్‌ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్‌ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement