గురువు దాతృత్వం
ఖాజీపేట : ప్రతి మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు..విద్యనేర్పిన పాఠశాల గురువు .. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీరి రుణం ఈ జన్మలో ఎవ్వరూ తీర్చుకోలేనిది.. తమకు భవిష్యత్ను ఇచ్చిన పాఠశాల రుణం తీర్చుకోవాలని చాలా మంది ఆలోచించరు. కానీ ఖాజీపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థి.. అక్కడే గురువుగా పనిచేసిన ఒక ఉపాధ్యాయడు తాను చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలని భావించారు. వెంటనే ఏం కావాలో అలోచించి విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేడు రూ 1.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెలితే ఖాజీపేటలో బత్తెన మల్లారెడ్డి(94) తనకు తెలిసిన విద్యను అందించి వారికి వెలుగు నింపిన గురువు. ఈయన ఖాజీపేట లోని బాలుర ఉన్నత పాఠశాలలో 1947 నుంచి 1951 వరకు 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నారు. 1951 నుంచి 52 లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. తాను చదువుకున్న స్కూల్లోనే 1975 నుంచి 1980లో రెండు సార్లు మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. ఈ పాఠశాల తన జీవితాన్ని మార్చిందని, ఆ పాఠశాల రుణం కొంతలో కొంతైనా తీర్చుకోవాలని భావించారు. తన కుమారులతో సంప్రదించి రూ 1.50కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల స్థితి గతులను గమనించి సరైన ఆడిటోరియం, అలాగే గ్రంథాలయం లేదని భావించారు.వెంటనే ఇంజనీరింగ్ ప్లాన్తో, అధికారుల అనుమతులతో వేగంగా పనులును చేపట్టారు. భవనం పూర్తి కావస్తోంది తాను చదివిన, అలాగే జీవితాన్ని ఇచ్చిన పాఠశాల రుణం కొంతైనా తీర్చుకుంటూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
చందువుకున్న స్కూల్కు రూ 1.50 కోట్లతో భవననిర్మాణం


