దొంగతనం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష
తొండూరు : తొండూరు పోలీస్స్టేషన్లో గతంలో ఇమాంబీ దర్గాలో హుండీ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు సోమవారం ఏడాది జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కేసులో షేక్ జిన్నాభిగారి హిదయతుల్లా, షేక్ గైబూషావలిపై 305కింద కేసు నమోదు చేయగా.. విచారణ అనంతరం కోర్టు వారిని దోషులుగా నిర్ణయించిందన్నారు. అయితే సెక్షన్ 317(2) బీఎన్ఎస్ కింద నేరం రుజువు కావడంతో పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజి స్ట్రేట్ చంద్ర శేఖర్ రెడ్డి తీర్పు ఇచ్చారన్నారు. ఇద్దరు నిందితులకు ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.1,000చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒకనెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు గతంలో అనుభవించిన నిర్బంధ కాలాన్ని శిక్షాకాలంలో మినహాయించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీ జి.మధుసూదనాచారి, పులివెందుల రూరల్ సీఐ ఎన్వీ రమణ, తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటి కేసు చేధనకు కృషి చేశారు.
ముగిసిన క్రికెట్ పోటీలు
కమలాపురం: మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసింది. ఫైనల్ పోరులో కడప వారియర్స్ జట్టు ట్రోఫీని అందుకుంది. గత మూడు రోజులుగా భారతి సిమెంట్స్ క్రీడా మైదానంలో ఆల్ ఓవర్ ఇండియాలోని వైకాట్కు చెందిన 7 టీములు నాకౌట్ మ్యాచ్లు ఆడాయి. చివరి రోజు సోమవారం కడప వారియర్స్, పులి ప్యాకర్స్ జట్లు ఫైనల్లో తల పడ్డాయి. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పులి ప్యాకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప వారియర్స్ 173 పరుగులు చేసి గెలుపొందింది.. కాగా తమ స్టేడియంలో మూడు రోజులుగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పండుగలా జరిగిందని ప్లాంట్ హెడ్ రామమూర్తి తెలిపారు. తమ సిబ్బంది ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లాగా నిర్వహించారని అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం విన్నర్స్, రన్నర్స్లకు ట్రోఫీలు, ప్రైజ్మనీ అందించారు. ప్రతి క్రీడాకారుడిని మెడల్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు భార్గవ్రెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
కమిషనర్కు వినతి
ప్రొద్దుటూరు : స్థానిక వెల్లాల టిఫెన్స్ యజమాని గోవిందరెడ్డి సోమవారం మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4న ఏసీపీ నాగరాజు తమ హోటల్కు వచ్చి వన్ బై టు కాఫీ ఇవ్వాలని అడుగగా దానిని నిరాకరించినట్లు తెలిపారు. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీపీ వెంటనే జేసీబీని తీసుకొచ్చి హాటల్ వద్ద ఉన్న ర్యాంప్ను తొలగించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జేసీబీ డ్రైవర్ వెంకటేశ్వర్లు దురుసుగా వ్యవహరించారన్నారు. ఈ సంఘటనతో తాము భయబ్రాంతులకు గురయ్యామని, తమ ఇమేజ్కు పెద్ద నష్టం కలిగించిందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా ఏసీపీ నాగరాజును ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా, ఔట్సోర్సింగ్ జేసీబీ డ్రైవర్ వెంకటేశ్వర్లును విధుల నుంచి తొలగించారు.
దొంగతనం కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష


