అద్దాల షాపులో చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో చందమామ డాబా సమీపంలో ఉన్న అద్దాల షాపులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. జీవనోపాధి కోసం శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన పాపారావు 15 ఏళ్ల క్రితం పులివెందులకు వచ్చి అద్దాలు, టోపీలు, హెల్మెట్లు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అద్దాలు, టోపీలు అమ్మిన వచ్చిన డబ్బులతో తమ పిల్లలను చదివించుకుంటూ ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు యువకులు ఆటోలో వచ్చి కడప రోడ్డులో ఉన్న అద్దాల షాపును పగులగొట్టి అందులోని టోపీలు, ఇళ్ల అద్దాలు, హెల్మెట్లు అపహరించి తీసుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అద్దాల షాపును పగులగొడుతుండగా.. పక్కనే ఉన్న కల్యాణ మండపం సిబ్బంది కేకలు వేయడంతో ఆటోలో వచ్చిన యువకులు షాపులో ఉన్న అద్దాలు, టోపీలు, హెల్మెట్లు తీసుకుని పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పులివెందులలో ఆగని చోరీలు
పులివెందుల పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణంలోని మారుతి హాలు, ఎస్బీఐ కాలనీ, నగరిగుట్ట ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా కడప రోడ్డులోని ఓ అద్దాల షాపులో కొంత మంది యువకులు ఆటోల్లో వచ్చి షాపులోని అద్దాలు, హెల్మెట్లు, టోపీలు అపహరించి తీసుకెళ్లారు. ఇలా పట్టణంలో ఏదోక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు.. దొంగలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక శ్రీరామ హాల్ రోడ్డులో రోడ్లపై ఉన్న కారు అద్దాలు కూడా పగలగొడుతూ కొంత మంది యువకులు వికృత చేష్టలు చేస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.30 వేల వస్తువుల అపహరణ


