హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపల్లె గ్రామానికి చెందిన మార్పురి సుధీకర్ను 2017లో హత్య చేసిన నిందితలకు గౌరీగాలే ఈశ్వరమ్మ, షిండే చంద్ర అలియాస్ చందు, సయ్యద్ ముబారక్ అలియాస్ పండులకు కడప 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.దీనబాబు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేలు జరిమానా విధించారు. కేసుకు సంబంధించిన పూర్వ పరాలు పరిశీలిస్తే 2017లో వివాహేతర సంబంధం, ఇతర కుటుంబ కలహాల నేపథ్యంలో మార్పురి సుధీకర్ను నిందితులు పెద్దచెప్పలికి చెందిన గౌరీగాళ్ల ఈశ్వరమ్మ, కమలాపురానికి చెందిన షిండే చంద్ర అలియాస్ చందు, అప్పాయపల్లె కు చెందిన సయ్యద్ ముబారక్ అలియాస్ పండు కలసి పథకం ప్రకారం కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పట్లో కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాలను, దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి జి.దీనబాబు నిందితులపై మోపిన హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులకు జీవిత కాల కఠిన కారాగాన శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరుపెట్టిన కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ను వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రాయుడులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.


