నేత.. కష్టాల కలబోత
నెరవేరని చంద్రబాబు హామీ
‘నేతన్న నేస్తం’అమలు చేయాలి
చేనేత కార్మికులను ఆదుకోవాలి
నేతన్నలకు కష్టకాలం దాపురించింది. ప్రభుత్వం నుంచి సాయం అందడంలేదు. చేనేత కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని, చేనేత ఉత్పత్తులపై 90శాతం రిబేట్ ఇస్తామంటూ 2024 ఎన్నికలముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలలకే చేనేత కార్మికులు మగ్గం విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది.
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల బతుకు భారంగా మారుతోంది. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంతో చేనేత వర్గాలను అన్ని విధాల ఆదుకోగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019 సంవత్సరానికి ముందు నేతన్నలు దయనీయ స్థితిలో ఉండేవారు. కనీస ప్రోత్సాహం లేక చాలా మంది కుల వృత్తికి దూరమయ్యారు. నూలు ధర పెరిగిపోవడం, ప్రభుత్వం నుంచి నూలు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వకపోవడం, రుణ సదుపాయం లేకపోవడంతో నేతన్నకు మగ్గం భారమైంది.
వైఎస్ జగన్ హయాంలో
వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో నేతన్నల జీవన చిత్రం మారిపోయింది. ఐదేళ్ల కాలంలో మగ్గాలకు మహర్దశ వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీమేరకు చతికిలబడిన నేతన్నకు ఊతమిచ్చి తిరిగి మగ్గం చేత పట్టేలా జగనన్న చర్యలు చేపట్టారు. నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి నెలకు రూ. 2 వేలు చొప్పున ఏటా రూ. 24 వేల ఆర్థికసాయం అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నేతన్నల ఆశలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి.
ఐదేళ్లపాటు ఆదుకున్న జగన్ సర్కారు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మగ్గానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా చేనేత కష్టాలు స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు పెట్టుబడి సాయంగా నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఒకే విడతలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాడే నేతన్న నేస్తం పథకాన్ని అమలులోకి తెచ్చారు. మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు చొప్పున జమ చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ సొమ్ముతో చేనేత కార్మికులు ముడి సరుకు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందారు.
దీంతో కులవృత్తికి దూరమై కూలీ పనులు చేస్తూ జీవనం గడిపే నేతన్నలంతా తిరిగి మగ్గం బాట పట్టారు. నేతన్నలకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. పథకాలు తారుమారవుతున్నాయి. ఈ జాబితాలో నేతన్న నేస్తం పథకం కూడా చేరింది. దీంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేతన్నలను ఆదుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యామ్నాయంగా మగ్గాలు వాడే కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ తమకు ఏమాత్రం ఉపయోగపడదని, నగదు రూపంలో ఇస్తే తాము ముడి సరుకు కొనుగోలు చేసి కులవృత్తిని చేసుకుంటామని నేతన్నలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచిఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. మళ్ల మగ్గం వదిలి కూలీ బాట పట్టాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని వారు వాపోతున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వలో నేతన్నలకు అందిన ఆర్థికసాయం
సంవత్సరం లబ్ధిదారులు అందించిన మొత్తం
2019–20 10,184 24,44,16,000
2020–21 10,492 25,18,08,000
2021–22 8241 19,77,84,000
2022–23 8545 20,50,80,000
2023–25 9446 22,67,04,000
చేనేత కార్మికులను పట్టించుకోని బాబు ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం
20 నెలల్లో పైసా విదల్చని
చంద్రబాబు ప్రభుత్వం
గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు సాయం అందింది. ఈ నిధులతో ముడిసరుకు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసి ఉపాధి పొందాం. ప్రస్తుత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి బదులుగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారు. దీని వల్ల మాకు ఉపయోగం ఉండదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఉచిత విద్యుత్పాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి.
– నామాల వెంకట సుబ్బయ్య, చేనేత కార్మికుడు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కింద ప్రతి ఏడాది రూ. 24 వేలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అందుకు సంబంఽధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చంద్రబాబు ఎన్నికల ముందు చేనేత కార్మికులకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని, 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ. 1500 ఇస్తానని అబుద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీ గురించి మరిచిపోయారు.చేనేత కార్మికులను ఆదుకోవాలి. – మామిళ్ల దేవా, మాధవరం –1, సిద్దవటం, మండలం.
నేత.. కష్టాల కలబోత
నేత.. కష్టాల కలబోత


