కమనీయం.. రంగనాథుని కల్యాణం
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద జరుగుతున్న శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. పురోహితులు మంగళసూత్రాలను భక్తులకు చూపించి స్వామివారి చేతికి తాకించి అమ్మవార్ల మెడలో వేశారు.శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులతో కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. అలాగే సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఆలయ ఈఓ రమణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కమనీయం.. రంగనాథుని కల్యాణం


