కడప సెవెన్రోడ్స్: కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పి–4 ‘స్టార్టప్ కడప‘ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని గురువారం సాయంత్రం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. జిల్లాకు తలమానికంగా అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా, వేగవంతంగా నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజారత్నం, కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ను అభినందించిన సీఎం చంద్రబాబు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం అభినందనీయమని, ఇందుకు కృషిచేసిన కలెక్టర్ శ్రీధర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంటిమిట్ట టీటీడీ అతిధి గృహంలో జిల్లాకు స్మార్ట్ కిచెన్గాను అందిన స్కోచ్ అవార్డు జ్ఞాపికను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్యమంత్రికి చూపించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును వివరించారు. జిల్లాలో ప్రస్తుతం ఐదు స్మార్ట్ కిచెన్ ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా భోజనం అందిస్తున్నామని, మరో 33 స్మార్ట్ కిచెన్లు నిర్మాణ దశలో ఉన్నాయని,ఇందులో 7 స్మార్ట్ కిచెన్లు వారంలోపు పూర్తి చేస్తామని,మిగిలిన 26 స్మార్ట్ కిచెన్లు నిర్మాణ పనులను ఏప్రిల్ నెలాఖరు లోపు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా,రాజంపేట సబ్ కలెక్టర్ భావన పాల్గొన్నారు.


