రైతుకేదీ శనగ!
కడప అగ్రికల్చర్: శనగ రైతును ధరాఘాతం వెంటాడుతోంది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ధర లేదు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. దిగుబడులు అరంభమైనా ఇంత వరకు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కూటమి సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. దీంతో రైతులు దళారులకు పంటను అప్పజెప్పి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. శనగకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రూ.5875 కేటాయించగా దళారీలు మాత్రం నాణ్యతను బట్టి క్వింటా రూ.4800 నుంచి 5100 తో కోలుగోలు చేసి రైతులకు శఠగోపం పెడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్కు సంబంధించి సాధారణ సాగు 79613 హెక్టార్లుకాగా 75775 హెక్టార్లలో శనగపంట సాగైంది. ప్రస్తుతం కోతలు ప్రారంభమయాయి. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ రైతులకు మద్దతు ధర కరువైంది. కేంద్ర ప్రభుత్వం శనగలకు రూ. 5875 మద్దతు ధర ప్రకటించింది. పోనీ ఆఽ ధరకై నా అమ్ముకుందామంటే ఎక్కడ ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో శనగపంట రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో అత్యధికంగా సాగు చేస్తారు. కేవలం మంచు ప్రభావంతో పూర్తయ్యే పంటను జిల్లాలో పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, వీఎన్పల్లి, రాజుపాలెం, దువ్వూరు, వేములు, వేంపల్లె మండలాల్లో ఈ ఏడాది అత్యధికంగా సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో జేజే –11 అత్యధికంగా సాగు చేశారు. ఒకటి రెండు నీటి తడులతో ఈ ఏడాది ఎకరాకు 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు.
రాసిపోసిన శనగలు
ఈ ఏడాది జిల్లాలో శనగ విస్తీర్ణంతోపాటు దిగుబడి కూడా పెరిగింది. దీంతో రైతులు సంతోషపడుతున్నారు. ధర బాగా ఉటుందని ఆశ పడ్డారు. కానీ పంట చేతి కోచ్చే సరికి చంద్రబాబు సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. దీంతో చేసేందేమిలేక చాలా మంది పొలంలోనే దళారీలకు అమ్ముకుంటున్నారు. వాళ్లు క్వింటాకు 4800 రుపాయల నుంచి నాణ్యతను బట్టి రూ. 5100 కొనుగోలు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమేమో రైతులకు క్వింటా మద్దతు ధరను 5875 రుపాయలు ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా క్వింటాపై 800 నుంచి 1000 రుపాయల తగ్గించి దళారీల చేతులో పెడుతున్నారు. అంటే ఒక్కో ఎకరాపైన రూ.8000 వేల నుంచి 10 వేలకుపైగా రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర వచ్చే వరకు పంట నిల్వ ఉంచుదామంటే సరైన వసతులు లేవు. దీంతో చేసేదేమి లేక ఎంతకు పడితే అంతకు అమ్ముకుంటున్నారు. దీనికితోడు గింజ నాణ్యత, తేమశాతం పేరు చెప్పి క్వింటాకు అదనంగా రెండుమూడు కింటాలు దండుకుంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.
రైతుకేదీ శనగ!


