పాఠశాలలో వ్యాయాయ ఉపాధ్యాయుడు కీలకం
కడప ఎడ్యుకేషన్ : పాఠశాల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతో కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని 40 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విషయంలో వ్యాయామ ఉపాధ్యాయుడి పాత్ర కీలకం అన్నారు. అలాగే ఈ సంవత్సరం రెండు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఒక జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించారన్నారు. ఇందుకుగాను ఆయన వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డిప్యూటి ఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి దేవాలయాలు కాదు క్రీడా మైదానాలు కావాలి అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రస్తుతం భారతదేశ యువతకు వ్యాయామ శిక్షణ, ఫిజికల్ యాక్టివిటీస్ అవసరమని చెప్పారు. అనంతరం జిల్లాలో ప్రతిభ కనబరిచిన 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ శిక్షణ సేవ అవార్డుతో సత్కరించారు. అలాగే 2025లో పదవీ విరమణ చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ పీఈటీ అండ్ శాప్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, స్టూడెంట్ కార్యదర్శులు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, సంఘ ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అగ్గిరప్పతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


