వక్ఫ్ భూముల స్వాధీనం చట్ట విరుద్ధం
కడప సెవెన్రోడ్స్ : మంగళగిరి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్బోర్డుకు చెందిన 71.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్దమని వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు విమర్శించారు. సోమవారం కలెక్టరేట్ పరిపాలనాధికారి కె.విజయ్కుమార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. వక్ఫ్బోర్డు లేదా భూమి యజమానులైన అంజుమిన్–ఇ–ఇస్లామియా అనుమతి లేకుండానే స్వాధీనం చేసుకున్నారని ఈ సందర్బంగా వారు తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ప్రభుత్వం పేపరు నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్పు చేశారని, వాస్తవానికి అది వక్ఫ్కు చెందిన భూమి అన్నారు. అలాగే మల్లయ్యపాలెం ప్రాంతంలో 232 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అత్యంత విలువైన ఈ భూములను సరైన వినియోగంలోకి తీసుకు వస్తే ముస్లిం సమాజానికి భారీ ఆదాయ వనరుగా ఉంటాయన్నారు. సీఆర్డీఏ పరిధిలో 50 వేల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా తీసుకున్న ప్రభుత్వం ఏపీఐఐసీ కోసం ఖరీదైన వక్ఫ్ భూములను తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అనుకూల వర్గాలకు ఈ భూములను కేటాయించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, వైఎస్సార్ సీపీ నాయకులు షఫీవుల్లా, ఎస్ఏ కరీముల్లా, బీహెచ్ ఇలియాస్, ఎస్.జమీల్, షేక్ అసిఫ్బాబా, ఫిరోజ్ఖాన్, మహమ్మద్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


