వక్ఫ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక
● ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా
కడప కార్పొరేషన్ : వక్ఫ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆరోపించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలోని అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలు, మల్లారెడ్డిపాలెంలో 232 ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం అన్యాయంగా భూ సేకరణ చేసి ఏపీఐఐసీకి ఇవ్వాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా పత్రికా ప్రకటన జారీ చేసిందన్నారు. ఆన్లైన్ రికార్డుల్లో వక్ఫ్ భూమిగా ఉండాల్సిన దాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయడం అన్యాయమన్నారు. వందల కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను ఇలా ఏపీఐఐసీకి ఇవ్వడాన్ని ముస్లిం మైనార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వైఎస్సార్సీపీ కూడా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాఽజధాని కోసం సీఆర్డీఏ ద్వారా 50 వేల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించిందని, ఈ 300 ఎకరాలు అలా ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. ఈ భూముల్లో ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడే విధంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయకుండా.. ఇలా టీడీపీ అనుకూల వర్గాలకు అప్పనంగా అప్పగించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. దీనివల్ల ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. ఈ భూమిని దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదన చేశారని, వక్ఫ్ బోర్డు సభ్యులెవరూ దీన్ని అంగీకరించలేదని.. అందుకే వారు బోర్డు మీటింగ్కు హాజరు కాలేదన్నారు. అయినా ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లడం చూస్తే ముస్లిం మైనార్టీల పట్ల ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిగా ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉన్నారని, ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఆయన ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముస్లిం సమాజ ఆకాంక్షలకు విరుద్ధంగా కమిటీపై ప్రభావం చూపుతూ అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వక్ఫ్ భూములు కాపాడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.


