విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు శివారులోని మారెమ్మ దేవాలయం సమీపంలో ఉన్న పొలంలో విద్యుదాఘాతంతో బడుగు పుల్లయ్య(66) అనే రైతు శనివారం దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దనూరుకు చెందిన పుల్లయ్య గతంలో ఆర్టీసీలో డ్రైవరుగా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం పొలంలో పంటకు నీరు వదిలేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు మార్లు ఫోన్ చేసినా స్పందనలేదు. దీంతో రాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు వారు గుర్తించారు. మోటరు బోరు ఆన్ చేయడానికి వెళ్లి స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్కు గురవడంతో పుల్లయ్య మరణించినట్లు భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
వేంపల్లె : వేంపల్లె పరిధిలోని ఓ ఇంట్లో చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె పోలీసుస్టేషన్లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం వేంపల్లెకు చెందిన నామా నరసింహులు అనే డెలివరీ బాయ్, మరో మైనర్ బాలుడితో కలిసి శ్రీచైతన్య పాఠశాల వెనుక వైపు నివాసం ఉన్న వరికూటి రఘునాథ్రెడ్డికి చెందిన ఇంటికి ఉన్న తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆల్మారాలో ఉన్న రూ.25 వేల డబ్బుతోపాటు రూ.22 వేల విలువ చేసే 11 చీరలు దొంగలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో సీఐ నరసింహులు, ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాహిర్ హుస్సేన్లు కలిసి శనివారం హనుమాన్ సర్కిల్లో నిందితులైన నరసింహులు, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. తరువాత కోర్టులో హాజరుపరచి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి డబ్బులను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.


