దొరికిన ఎర్రచందనం దొంగలు
రాజంపేట : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్ప డుతున్న ఐదుగురు స్మగ్లర్లు పోలీసులకు దొరికారు. నందలూరు, మన్నూరు పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 36 ఎర్రచందనం దుంగలు పట్టుకుని, ఐదుగురి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేతన్ విశ్వనాథ్ శనివారం మీడియాకు వెల్లడించారు. మన్నూరు అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాజంపేట మండలం రేణింతల అ రంధతివాడ సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్య లు చేపట్టారు. పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు పరారీ అయ్యేందుకు యత్నించారు. వారిలో ఒకరు పట్టుబడ్డారు. విచారణలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నేరాన్ని అంగీకరించారు. దాచిపెట్టిన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి టీసుండుపల్లె మండలం మాచిరెడ్డిపల్లె గ్రామం పాలెంగడ్డ బిడికి చెందిన చౌదా రవికుమార్గా గుర్తించారు. గతంలో ఇతనిపై 12 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. నందలూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం నందలూరు మండలం మూతపడ్డ ఆల్వీన్ ఫ్యాక్టరీ వద్ద ఎర్రచందనం చెట్లు నరికి, దుంగలుగా మార్చి వాటిని అమ్ముటకు వస్తుండగా, నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో నందలూరు మండలం కోనాపురం కొత్తచాపలవారిపల్లెకు చెందిన ఆవుల రవికుమార్ ఉన్నారు. ఇతనిపై ఎర్రచందనానికి సంబంధించి 16 కేసులు ఉన్నాయి. పీడియాక్టు కూడా నమోదు చేశారు. నందలూరు మండలం ఎంఎంపురం పంచాయతీ కోనాపురం అరుంధతీవాడకు చెందిన పొత్తపి పెంచలయ్య, నందలూరు మండలం వెంకటరాజంపేటకు చెందిన చుక్కా మురళీ, నందలూరు మండలం కోనాపురం గ్రామం కొమ్మూరుకు చెందిన గుమ్మళ్ల రమేష్ ఉన్నారు. వీరి వద్ద నుంచి 21 దుంగలు, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విధులలో ప్రతిభ చూపిన రాజంపేట ఏఎస్పీ మనోజ్రామ్నాథ్ హెగ్డే, మన్నూరు సీఐ ప్రసాద్బాబు, నందలూరు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మన్నూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు, రెడ్శ్యాండిల్ ఇన్స్పెక్టరు సి.శంకర్రెడ్డిలను ఎస్పీ అభినందించారు.
దారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్
వల్లూరు(చెన్నూరు) : దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన మండలంలోని ఉప్పరపల్లె క్రాస్ రోడ్ వద్ద ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చింతకుంట సత్యనారాయణరెడ్డి అనే వృద్ధుడు నిలుచొని ఉండగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి గ్రామంలో దించుతానని చెప్పి మోటార్ సైకిల్పై ఎక్కించుకున్నాడు. కొంత దూరంలో ఉన్న బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి దించాడు. తాను పోలీసునని చెప్పి వృద్ధుడి వద్ద ఉన్న సుమారు 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ. 3,500 నగదు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన పోరుమామిళ్ల పట్టణం పెద్ద మసీదు వీధికి చెందిన షేక్ షఫీ అలియాస్ మహబూబ్ షఫీని మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4.6 గ్రాముల బంగారు ఉంగరం, రూ.3500 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
దొరికిన ఎర్రచందనం దొంగలు


