చంద్రబాబు ఇప్పటికై నా క్షమాపణ చెప్పాలి
● సీబీఐ కంటే పెద్ద సంస్థ ఉంటే
దానితో జరిపించాలి కానీ
ఏక సభ్య కమిషన్ ఎందుకు..?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి
కడప కార్పొరేషన్ : తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం దర్యాప్తు చేసి సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికై నా ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ పవిత్రత గురించి పదే పదే మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందన్నారు. వైఎస్సార్సీపీని భూస్థాపితం చేయాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సర్వనాశనం చేయాలనే కుట్రతో గాలి వార్తల ఆధారంగా 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారన్నారు. జంతు కొవ్వు కలిసిందని, చేపనూనె కలిపారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై గౌరవం, వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉన్న వారెవరూ ఇలాంటి ప్రకటన చేయరన్నారు. భక్తుల మనోభావాలు తెలిసి ఉంటే తనకున్న అధికారంతో దర్యాప్తు చేయించి, నిజ నిర్ధారణ జరిగాక చెప్పి ఉండాలన్నారు. అలాకాకుండా రూ.120కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేలా నిందారోపణలు చేశారన్నారు. దీంతో తమ పార్టీ సుప్రీం కోర్టు తలుపుతట్టిందని, ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తారని సుప్రీం కోర్టు కూడా తలంటిందన్నారు. సీబీఐ వేసిన సిట్ బృందంలో ఏపీ అధికారులు కూడా ఇద్దరు ఉన్నారని, కేంద్రలో కూడా వీరు పొత్తు పెట్టుకున్న ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. 210 పేజీలతో సిట్ నివేధిక ఇవ్వగా పేజీ నంబర్ 44,62 లలో లడ్డుకు వాడే నెయ్యిలో జంతుకొవ్వులు కలవలేదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఇంత జరిగాక లెంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడితో సమావేశమై.. బాత్రూములు శుభ్రపరిచే రసాయనాలు కలిశాయని మరో అబద్ధం ఆడటం దుర్మార్గమన్నారు. 2024 జూలై 12,21,25, జూలై 24లో నెయ్యి ట్యాంకర్లలో నాణ్యతా లోపం ఉన్నందున టీటీడీ అధికారులు వాటిని తిప్పి పంపారన్నారు. అవి రాఘవేంద్ర క్రషర్ మిషన్ వద్ద ఉండి 20రోజుల తరా్వాత అవే ట్యాంకర్లు తిరిగి లోపలికి వచ్చాయన్నారు. అంటే టీటీడీ ఆ ట్యాంకర్లు వద్దని వెనక్కి పంపితే టీడీపీ వెల్కమ్ చెప్పిందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలో నెయ్యి రూ.320కి కొంటే, చంద్రబాబు హయాంలో రూ.290కే కొన్నారని గుర్తు చే శారు. బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని, 2019 మార్చి 6న ఆ సంస్థకు రూ.82వేల కిలోల నెయ్యిని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. సీబీఐ సిట్ దర్యాప్తు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లు ఇచ్చిన రిపోర్టులు నిజం కాదట, చంద్రబాబు చెప్పేదే నిజమట.. అని ఎద్దేవా చేశారు. సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అని, దానికంటే పెద్ద సంస్థ ఏదైనా ఉంటే దానితో దర్యాప్తు చేయించకుండా ఏక సభ్య కమిషన్ ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. చంద్రబాబుకు ఆత్మలేదని, అంతరాత్మ అంతకంటే లేదన్నారు. పాలు లేకుండా పెరుగు అమ్మిన వాళ్లు భూమ్మీద ఎవరూ లేరని, అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. లడ్డూలో మేం కల్తీ చేసింటే మా చేతులు పడిపోతాయని, మేం చేయకపోతే చంద్రబాబు మాట పడిపోతుందన్నారు. ఆనాడు ఎన్టీఆర్కు ద్రోహం చేశారని, ఇప్పుడు ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు స్వామిపట్ల భక్తి ఏమాత్రం లేదని, ఇంత దుష్ప్రచారం చేసి ఏడుకొండలవాడికి తీరని అపచారం చేసిన చంద్రబాబు చరమాంక దశ ఘోరంగా ఉండబోతుందని హెచ్చరించారు.


