ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం
బ్రహ్మంగారిమఠం : మండలంలోని నరసన్నపల్లెకు చెందిన కొనిరెడ్డి నాగ వీరప్రతాప్రెడ్డి (20) అనే విద్యార్థి శుక్రవారం ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపల్లెలోని దేవరకొండ కృష్ణయ్యకు చెందిన ట్రాక్టర్కు ఆశ్రమానికి చెందిన రామోహన్రావు యాదవ్ (బాజీ) డ్రైవర్గా ఉన్నాడు. శుక్రవారం నరసన్నపల్లె నుంచి డ్రిప్ పైపులు దాదాపు 20 కట్టలతో ఆరుగురు కూలీలతో అంబవరానికి తీసుకువెళ్తున్నాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో గంగిరెడ్డిపల్లె కాలనీ దగ్గర పెద్దరాయిని ట్రాక్టర్ టైర్ ఎక్కడంతో.. అందులో ఉన్న నాగవీరప్రతాప్రెడ్డి జారి పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ టైర్ తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వీరప్రతాప్రెడ్డి ఇంటర్ చదువుతూ కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. డ్రైవర్కు కనీసం లైసెన్స్ లేదని, అటువంటి వ్యక్తిని డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రతాప్రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. ప్రతాప్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తీసుకువెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులు నరసన్నపల్లెలో అంత్యక్రియలు చేశారు. పోలీసులు ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.


