ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు అడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు.
ఆశ్వవాహనంపై సీతాపతి
శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తుల ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.
పోటెత్తిన భక్తులు
ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తుల తాకిడి ఉన్నంత వరకు అంతా సాఫీగానే సాగింది. ఉదయం 11 గంటలకు నైవేద్యం విరామం అనంతరం భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ రంగమండపం చుట్టూ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల నుంచి దర్శనం కోసం భక్తులు దూసుకొచ్చారు.టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కట్టడి చేయలేకపోయారు.దీంతో క్యూలైన్లలో ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా క్యూలైన్లు కూడా భక్తుల తాకిడికి ఒరిగి పోయాయి. అయినా విజిలెన్స్ సిబ్బంది అక్కడ ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఆశ్వ వాహనంపై ఊరేగుతున్న ఒంటిమిట్ట విభుడు
అలరించిన కోలాట ప్రదర్శన


