హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని నాగులకట్టవీధిలో మూడు రోజుల క్రితం జరిగిన సుబ్రమణ్యం హత్య కేసులో నిందితున్ని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను ధూషించినందుకే సుబ్రమణ్యంను వినయ్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ వివరాలను త్రీ టౌన్ పోలిస్స్టేషన్లో ఆదివారం సాయంత్రం సీఐ టీవీ కొండారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గువ్వల సుబ్రమణ్యం కార్పెంటర్గా పని చేస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ రావడంతో యాక్టింగ్ డ్రైవర్గా కూడా వెళ్తుంటాడు. అతను 15 ఏళ్ల క్రితం రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామంలో పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా సుబ్రమణ్యం పనులు చేసుకుంటూ ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. అతను ప్రతి రోజు మద్యం తాగేందుకు వైన్ షాపునకు వెళ్లే క్రమంలో నాగులకట్ట వీధికి చెందిన నవీన్ పరిచయమయ్యాడు. ఇటీవల ఇద్దరు మద్యం తాగే సమయంలో గొడవ పడ్డారు. అక్కడ వారి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని మనసులో పెట్టుకున్న వినయ్ సుబ్రమణ్యంను ఎలాగైనా హతమార్చాలని పథకం రచించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 13న మద్యం తాగేందుకు తన ఇంటికి రావాలని సుబ్రమణ్యంను వినయ్ పిలిచాడు. అతను రాత్రి 8 గంటల సమయంలో నాగులకట్ట వీధిలోని వినయ్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మద్యం తాగేందుకు సిద్ధం అవుతుండగా సుబ్రమణ్యం గొంతు భాగంలో కత్తితో పొడిచి వినయ్ పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని భార్య గువ్వల రమాఅనిత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసులోని నిందితుడు వినయ్ జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం బస్స్టాప్ వద్ద ఉండగా సీఐ కొండారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడ్ని రిమాండుకు తరలించినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు.


