ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
లింగాల : మండల పరిధి ఇప్పట్ల గ్రామ సమీపంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొని షేక్ ఆలీ మౌలా(58) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇప్పట్ల గ్రామ సమీపంలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పొలానికి కాపలాగా ఉన్న ఆలీ మౌలా.. పొలం నుంచి పార్నపల్లె – పులివెందుల ప్రధాన రహదారిపైకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో కోమన్నూతల గ్రామానికి చెందిన గంట వెంకట శివ మరో ఇద్దరు ఒకే మోటారు సైకిల్పై అతి వేగంగా పులివెందులకు వెళ్తూ ఆలీ మౌలాను వెనుక వైపు నుంచి ఢీకొన్నారు. దీంతో ఆలీ రోడ్డుపై బోర్లపడి నుదిటికి బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలీ మౌలాను ప్రైవేట్ వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బతినగా, వాహనం నడుపుతున్న వెంకట శివ గాయాలపాలయ్యాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
శుక్రవారం సాయంత్రం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ ఎన్వీ రమణ, ఎస్ఐ జగదీశ్వరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో లింగాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


