భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తేనే దేవుడు ఆలకింపు
కడప సెవెన్రోడ్స్ : భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రార్థనలను మాత్రమే దేవుడు ఆలకిస్తారని ఫాదర్ ఈరి సుందర్ అన్నారు. కడప నగరంలో లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శుక్రవారం మరియాపురం పాత చర్చి ఆవరణలో ఆయన దివ్య బలిపూజ నిర్వహించారు. దయ, ప్రేమ, కరుణ కలిగిన సద్గుణ రాసి మరియమాత అని కొనియాడారు. అందరూ ఆమె కృపకు పాత్రులు కావాలన్నారు. ఫాదర్ ధర్మరాజ్ సీజేసీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. 1858లో ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో బెర్నదత్ అనే 14 ఏళ్ల బాలికకు దర్శనమిచ్చినందున ఆమెకు లూర్దుమాత అనే పేరు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ప్రార్థనలు చేసి తల్లి దీవెనలు పొందాలని సూచించారు. తిరునాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. తొలుత లూర్దుమాత స్వరూపాన్ని మరియాపురం వీధుల్లో ఊరేగించారు. దీప స్తంభానికి ఫాదర్లు, సిస్టర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్య బలిపూజలో విచారణ గురువులు ఈరి లూర్ధు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, ఫాదర్ హృదయరాజు, ఫాదర్ సిప్రి యన్, ఫాదర్ సంబటూరు సురేష్, తిరునాల కమిటీ అధ్య క్షుడు గుంత మళ్ళ బాలయ్య, ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్, ఉపాధ్యక్షడు లూర్దు, ట్రెజరర్ నంది మండలం విజయరాజు, ఎండీ అల్ఫోన్స్, ఇల్లూరి జయరాజు, మేత్రాసన గురువులు, సిస్టర్లతోపాటు వివిధ విచారణలకు చెందిన గురువులు, ప్రజలు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తేనే దేవుడు ఆలకింపు


