నీటికుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
పోరుమామిళ్ల/కలసపాడు : పోరుమామిళ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్యార్డు సమీపంలో ఉన్న రెడ్డికతువ (నీటికుంట)లో ఇంటర్ విద్యార్థి సగిలి ఇమ్మానుయేలు(18) శవమై తేలాడు. సోమవారం సాయంత్రం సమాచారం పోలీసులకు చేరడంతో ఎస్ఐ హనుమంతు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. కలసపాడు మండలం ముద్దంవారిపల్లె ఎస్సీకాలనీకి చెందిన అన్వేటర్ భాస్కర్ మొదటిభార్య కుమారుడు ఇమ్మానుయేలుగా గుర్తించారు. ఈ విషయమై ఎస్ఐని విచారించగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడన్నారు. మృతికి ఎలాంటి కారణాలు లేవని, జారి పడటం వల్లే మృతి చెందాడన్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగిందని, దాంతో ఇమ్మానుయేలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడా? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మానుయేలు పోరుమామిళ్లలోని ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్నాడు. ఈ విషయమై కళాశాల యాజమాన్యాన్ని విచారించగా ఇతను తెలివైన విద్యార్థి అని తెలిపారు. అయితే ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడని, కాలేజీకి తాగి వస్తుండటంతో తండ్రికి చెప్పామన్నారు.ఒకటి రెండు సార్లు ఊరు వదిలి వెళ్లి పోయాడని, మళ్లీ వచ్చాడన్నారు. మూడు రోజుల క్రితం కళాశాల వార్షికోత్సవానికి కూడా తాగి రావడంతో వాళ్ల నాన్నకు చెప్పి, అతన్ని ఇంటికి తీసుకుపోవాలని చెప్పామన్నారు. తెలివైన విద్యార్థి తాగుడుకు అలవాటు పడటం, ఇలా అకాల మరణం చెందటం బాధగా ఉందని కళాశాల యాజమాన్యం తెలిపింది.
నీటికుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి


