బద్వేలులో దొంగల హల్చల్
– ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీ
బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో దొంగలు మంగళవారం పట్టపగలే ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టణంలోని చెన్నంపల్లె మిట్టకు చెందిన చిన్నవీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా దుండగులు లోనికి ప్రవేశించి బీరువా పగులకొట్టి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.44 వేలు నగదు, కొన్ని వెండి వస్తువులు అపహరించుకుని పోయారు. అలాగే సురేంద్రనగర్లోని గొడుగునూరు గోపి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. తన భార్యకు పరీక్ష ఉండటంతో ఇంటికి తాళం వేసి కడపకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు బీరువా పగులకొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గోపి ఇంట్లో 6 తులాలు బంగారు ఆభరణాలు, రూ.20 వేలు నగదు, కొంత వెండి సామాగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే చెన్నంపల్లె సమీపంలోని తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో కూడా దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేలు నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సురేంద్రనగర్లోని ప్రైవేటు ఉపాధ్యాయుడు గోపి ఇంట్లో గల సీసీ కెమెరాలో ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నట్లు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.


