కన్నతల్లిని కడతేర్చిన కొడుకు అరెస్టు
ఎర్రగుంట్ల : అప్పు కట్టమని చెప్పిన కన్నతల్లి చాప సుందరమ్మపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన కేసులో కుమారుడు జాకోబ్ను అరెస్టు చేసినట్లు ఎర్రగుట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.... పోట్లదుర్తి గ్రామం క్రిస్టియన్లేన్ కాలనీలో నివాసం ఉన్న సుందరమ్మ (80), అబ్రహాం(లేట్)లకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. సుందరమ్మ తన కుమారుడైన జాకోబ్ వద్ద ఉంటుంది. జాకోబ్ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాకోబ్కు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు. కుమార్తె లత ఉన్నారు. లతను ప్రొద్దుటూరు మండల పరిధిలోని కానపల్లెకు ఇచ్చి వివాహం చేశారు. పోట్లదుర్తిలోని తన ఇంటి నిర్మాణంనకు కుమార్తె లత వద్ద రూ.18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును ఇవ్వాలని లత తన తండ్రి జాకోబ్ను అడిగింది. ఈ విషయంలో జాకోబ్ కుమార్తెతో గొడవ పడ్డాడు. ఈ విషయంపై జాకోబ్ తల్లి సుందరమ్మ మనవరాలు లతతో గొడవ వద్దు.. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా ఇవ్వమని కుమారుడైన జాకోబ్కు చెప్పింది. మనవరాలికి సపోర్టు చేస్తావా అని సుందరమ్మపై ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. బంధువులు గమనించి సుందరమ్మను ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్సకు తీసుకెళ్లారు. అక్కడ సుందరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాకోబ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ మెరుగైన వైద్యం కోసం సుందరమ్మను కడప రిమ్స్కు తరిలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. సుందరమ్మ చనిపోయిన కారణంగా జాకోబ్పై హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


