పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జేసీ డాక్టర్ నిధి మీనా సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల సన్నద్ధత, మహాశివరాత్రి ఉత్సవాలలో వసతులు, భద్రతా ఏర్పాట్లు, సానుకూల ప్రజా దృక్పథం, డాక్యుమెంట్ అప్ లోడ్, కోర్టు బిల్డింగుల కోసం స్థల సేకరణ, కొత్త జిల్లాల్లో నూతన కోర్టు భవనాల కోసం స్థల సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరు కాగా, స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రత్యేక అమలు కార్యక్రమాలతోపాటు ప్రధానంగా పారదర్శకంగా పీజీఆర్ఎస్ అమలు, సజావుగా గ్యాస్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు సంతప్తికరమైన సేవలు అందించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని 16 ప్రధాన శైవ క్షేత్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఎలాంటి కొరత లేకుండా వసతులను సమకూర్చేలా రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జేసీ డాక్టర్ నిధి మీనా


