రంగ రంగ..వైభవంగా..
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో శ్రీరంగ నాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజాద్రవ్యాలు సమర్పించారు. ఆ దేవదేవుడిని దర్శించి తరించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అక్కడక్కడా భక్తులకు ప్రసాదాలు, శీతల పానీయాలను పంపిణీ చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కో–ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి, అంకాలమ్మ ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణలతో పాటు వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఈఓ వెంకటరమణ వారిని శాలువాలతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం గోవింద నామస్మరణతో శ్రీరంగనాథుని రథోత్సవాన్ని భక్తులు కదిలించారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్కు చేరుకుంది. స్థానిక పూల అంగళ్ల సర్కిల్లో తిరుణాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుణాలలో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. రథోత్సవం వెంబడి అళ్లగడ్డ లక్ష్మీ తేజశ్విని కోలాట బృందం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తిరుణాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ప్రజలు బొమ్మలు, ఇతర ఆట వస్తువులను కొనుగోలు చేశారు.
కదిలింది శ్రీరంగనాథుని బ్రహ్మరథం
దారిపొడవునా గోవింద నామస్మరణలు,భజనలు
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
రంగ రంగ..వైభవంగా..


