మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
మహాశివరాత్రికి 347 బస్సులు
కడప సెవెన్రోడ్స్: మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల సందర్బంగా జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, తరలివచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు, భద్రతా ఏర్పాట్లను కల్పించామని పేర్కొన్నారు. పార్వతీపరమేశ్వరుల కళ్యాణోత్సవాలు, ఊరేగింపు తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదా య, రెవెన్యూ, పోలీసు శాఖల ద్వారా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు
శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు సమాచార, సహాయం నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, 21 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి నేపథ్యంలో ఈనెల 14 నుంచి 16వ తేది వరకు 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ సేవలు ఉంటాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఉత్సవాలకు గట్టి బందోబస్త్ ఏర్పాటు: ఎస్పీ
పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధికారులకు సూచించారు. పొలతల క్షేత్రంలో చేపడుతున్న ఉత్సవాల ఏర్పా ట్లను గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతూ పర్యవేక్షించాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు సదాశివయ్య, చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఈఓ క్రిష్ణానాయక్ పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప కోటిరెడ్డిసర్కిల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప రీజియన్ పరిధిలో వివిధ శైవ క్షేత్రాలకు 347 బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. రీజియన్ పరిధిలోని పొలతలకు 165, నిత్యపూజకోన 52, లంకమల 38, బి.మఠం 17, హత్యరాల 22, జ్యోతి క్షేత్రానికి 6 బస్సులతోపాటు ఇతర శైవ క్షేత్రాలకు 47 బస్సులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోని శివయ్య కృపను పొందాలని సూచించారు.


