ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో షేక్ దర్బార్ వల్లి అనే దొంగను రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ వివరాలను తెలియజేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసామన్నారు. సత్యసాయి జిల్లా గౌకనపల్లి చెందిన షేక్ దర్బార్ వల్లి (42) గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన పాత పద్ధతి మార్చుకోకుండా మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. అరెస్తయిన దర్బార్వల్లిని విచారించగా కడపలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన పది మోటార్ సైకిళ్ల గురించి సమాచారం ఇచ్చాడని, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామన్నారు. దొంగను పట్టుకున్న కడప తాలూకా సీఐ టి రెడ్డెప్ప, ఎస్ఐలు మోహన్ కుమార్ గౌడ్, మహమ్మద్ రఫీలను జిల్లా ఎస్పీ అభినందించారు.
లోయలోకి దూసువెళ్లిన లారీ
– ఒకరి మృతి, డ్రైవర్కు గాయాలు
చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఖార్జురచెట్ల లోడుతో సేలం నుంచి పూణేకు వెళుతున్న టీఎన్ 52కే 9747 నంబరుగల లారీ బుధవారం కడపకు వస్తుండగా ఘాట్ నాలుగో మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకవెళ్లినట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. విషయంతెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక అధికారి యోగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్ గోపినీ ప్రాణాలతో కాపాడారు. గాయపడిని అతన్ని అంబులెన్సు ద్వారా రిమ్స్కు తరలించారు, లారీలోని మరో వ్యక్తి శరవణ్ కుట్టి అప్పన్ ( 37) ఖార్జుర చెట్ల కింద పడి ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు యంత్రాల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి యోగేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలిసి లారీలో చిక్కుకున్న డ్రైవర్ గోపి ని ప్రాణాలతో కాపాడటం పట్ల పలువురు అభినందించారు.కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ బాలమద్దిలేటి,ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్


