పూందమల్లి–వడపళని మధ్య సేఫ్టీ టెస్ట్ రన్
సాక్షి, చైన్నె : ఫేజ్ –2 లో భాగంగా చైన్నెలో పూందమల్లి – వడపళణి మధ్య మెట్రో రైలు సేప్టీ టెస్ట్ రన్ బుధవారం ప్రారంభమైంది. ఈ రన్ను రైల్వే భద్రతా కమిషర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. మరో రెండు రోజుల పాటూ ఈ రన్ జరగనుంది. వివరాలు.. చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో మూడు మార్గాలలో పనులు జరుగుతున్నాయి. ఇందులో పూందమల్లి – లైట్ హౌస్ మార్గంలో పనులు శరవేగంగా సాగుగుతున్నాయి. ఇప్పటికే పూందమల్లి నుంచి పోరూర్ – వడపళణి వరకు వంతెన మార్గంలో, కోడంబాక్కం నుంచి పనగల్ పార్కు మీదుగా లైట్ హౌస్ వరకు భూగర్భ మార్గంలో రైలు పయనించనుంది. ఇందుకు సంబంధించిన పనులను ఆయా ప్రాంతాలను విభజించి నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో అత్యంత రద్దీతో కూడుకున్న టీ నగర్ పనగల్ పార్కు – కోడంబాక్కం మధ్య జరుగుతూ వచ్చిన భూగర్బ రైల్వే మార్గం తవ్వకాల పని ముగించారు. ట్రాక్, రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9 కి.మీ దూరం రైల్వే స్టేషన్లు తదితర పనులన్నీ ముగిశాయి. ట్రయల్ రన్ పలుమార్లు విజయవంతం చేశారు. అలాగే, ఇదే మార్గంలో పోరూర్ నుంచి వడపళని వరకు సైతం పనులన్నీ ముగించారు. గత నెల పూందమల్లి నుంచి వడపళణి వరకు రైలు సేవలకు నిర్ణయించినా, రైల్వే భద్రతా కమిషన్ నుంచి అనుమతి అన్నది దక్కలేదు. దీంతో ఆ దిశగా మెట్రొ వర్గాలు కసరత్తు చేపట్టాయి.
సేఫ్టీ టెస్ట్ రన్..
రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం బుధవారం చైన్నెకు చేరుకుంది. పూందమల్లి – వడపళణి మధ్య మెట్రో నిర్వహణకు సంబంధించి అన్ని పనులను ఈ బృందం పరిశీలించింది. మెట్రో రైలును తక్కువ వేగంతో నడపడం, భద్రతా పరంగా ఉన్న అన్ని రకాల అంశాలను ఈ బృందం వీక్షించింది. బ్రేకింగ్ టెక్నాలజీ, పట్టాల నాణ్యత, పటిష్టత, రైలు కోచ్లలో సౌకర్యం, ప్రయాణికులకు కల్పించిన భద్రతా, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేఫ్టీ రన్ జరిగింది. తొలి రోజున తక్కువ వేగంతో రైలు ముందుకు సాగినా, రెండో రోజుగా గురువారం 80 నుంచి 90 కీ.మీ వేగంతో రైలు నడిపేందుకు , భద్రతా పరంగా సమస్యలను సమగ్ర అధ్యయనం చేసే విధంగా సేప్టీ రన్ జరగనుంది. మూడు రోజుల ఈ సేప్టీ రన్ తదుపరి, ఈ మార్గంలో రైలు నడిపేందుకు సంబంధించిన అనుమతులను ఈ కమిషన్ ఇవ్వనుంది.


