దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు
2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.
రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.
తగ్గుతున్న ధాతు గ్రేడ్లు
రాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.
ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.
పెరుగుతున్న డిమాండ్
రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.
ధరల దిశ
2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తు ఎలా?
వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.
మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!.


