నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ‘సూపర్–8’ పోరు
జోరుమీదున్న ఇరు జట్లు
టి20 ప్రపంచకప్
రాత్రి గం 7 నుంచి ‘స్టార్స్పోర్ట్స్’, ‘జియో హాట్స్టార్’లలో ప్రసారం
5-2 టి20 వరల్డ్ కప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 7 మ్యాచ్లు జరగ్గా భారత్ 5 గెలిచి 2 ఓడింది
రెండేళ్ల క్రితం టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్... ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 7 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. అభిమానులెవరూ దీనిని మరచిపోలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్లు జరిగినా...వరల్డ్ కప్ లెక్కే వేరు. నాటి ఫైనల్ తర్వాత ఇప్పుడు రెండు టీమ్లు అదే వరల్డ్ కప్ అసలు మ్యాచ్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్లో 2024 ఫలితాన్ని భారత్ పునరావృతం చేస్తుందా లేక దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా ఆసక్తికరం.
అహ్మదాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్లో భారత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడింది. అన్నింటా గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ ఎదురుపడిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గట్టి ప్రత్యర్థులైతే కానే కావు. దాయాది పాకిస్తాన్ అయినా పోటీ ఇస్తుందనుకుంటే ఆ మూడింటి సరసనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆడిన అన్ని గెలిచాం. అజేయమని ఆదమరిస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
‘సూపర్ ఎయిట్స్’ దశలో భాగంగా నేడు (ఆదివారం) జరిగే పోరులో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్లో ఆడిన నాలుగూ గెలిచి టాపర్గా ముందంజ వేసింది. బలాబలాలను బట్టి చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం.
అభిషేక్ ‘జీరో’ నుంచి ‘హీరో’ అయ్యేనా...
సూపర్ హిట్టర్, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. మెరుపులతో మురిపిస్తాడని, మ్యాచ్లను ఏకపక్షంగా మలిచేస్తాడని భావించింది. కానీ ఈ ప్రపంచకప్లోనే అభిషేక్ ఖాతా తెరువలేదు. అన్ని ‘జీరో’లే! భారత్ స్థాయికి తగని ప్రత్యర్థులతోనే అతను ఆడలేకపోవడం జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్ పోరులో అయినా ఖాతా తెరవాలని, సఫారీ బౌలింగ్పై మెరిపించాలని జట్టే కాదు యావత్ దేశం గట్టిగా కోరుకుంటుంది.
నిజం చెప్పాలంటే ఇప్పటివరకు భారత్ ఈ మెగా ఈవెంట్లో గొప్ప మ్యాచ్ అయితే ఆడలేదు. అమెరికాతో జరిగిన పోరులో ఒకే ఒక్కడు సూర్యకుమార్ మెరిపించాడు. ఇంకెవరూ 30 పరుగులైనా చేయలేదు. నమీబియాలాంటి ప్రత్యరి్థపై కూడా ఆడింది ఇద్దరే! ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు ఫిఫ్టీలు చేశారు. పాక్తో కీలకమైన పోరు జరిగినా దంచింది మాత్రం ఇషాన్ కిషన్ ఒక్కడే! నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి పోరులోనూ భారత ఇన్నింగ్ ఒక్కడి ఫిఫ్టీపైనే ఆధారపడింది. శివమ్ దూబే రాణించాడు.
క్రికెట్ కూనలే ఎదురైనా, పాక్తో జాగ్రత్తగా ఆడాల్సివున్నా... ప్రతీ మ్యాచ్లో ఏ ఒకరో లేదంటే ఇద్దరో ఆడారు. ఇకపై కూడా ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచేయొచ్చనుకుంటే భారత్ కథ ఈ సూపర్–8కే పరిమితమవుతుంది. స్పీడ్స్టర్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు భారత టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని ప్రతి మ్యాచ్లోనూ నిలబెడుతున్నారు.
దుర్బేధ్యంగా దక్షిణాఫ్రికా
ఈ ప్రపంచకప్లో గత ఫైనలిస్టు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఆడింది. ప్రధాన బ్యాటర్లే కాదు.... లోయర్ మిడిలార్డర్లోనూ దంచేసిన ఆటగాళ్లున్నారు. అమెరికాపై 200 పైచిలుకు చేసిన సఫారీ... అఫ్గాన్పై 187/6 స్కోరు చేసింది. ఇక కివీస్పై అయితే 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యూఏఈని తక్కువ స్కోరు (122/6)కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే ఛేదంచింది.
కెప్టెన్మార్క్రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్ ఇలా అందరూ ఫామ్లో ఉన్నారు. అంతకుమించి సమష్టిగా రాణిస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్లోనూ ఒకరిద్దరితో గెలిచిన సందర్బాలే లేవు. ఇక బౌలింగ్ బలం గురించి చెప్పాల్సిన పనిలేదు. రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్, యాన్సెన్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగలరు.
పిచ్–వాతావరణం
అహ్మదాబాద్ వికెట్ బ్యాటింగ్కే అనుకూలం. ప్రత్యేకించి టి20లైతే ధనాధన్ షో గ్యారంటీ. ఈ మైదానంలో ఛేదన సులువు కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్కు వర్షం ముప్పయితే లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, వరుణ్, బుమ్రా, అర్ష్ దీప్.
దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్.


