దేశ రాజకీయాల్లో భూకంపం | Usha S Danny Write on Naravane Book Controversy | Sakshi
Sakshi News home page

ఆ నిర్ణయం ప్రధానిదా? ఆర్మీ ఛీఫ్‌దా?

Feb 10 2026 1:05 PM | Updated on Feb 10 2026 1:11 PM

Usha S Danny Write on Naravane Book Controversy

అభిప్రాయం

భారత్‌–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా, లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది. భారత ఆర్మీ మాజీ ఛీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణె రాసిన ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకం (Four Stars of Destiny) అధికారికంగా ఇంకా ప్రచురణ కాలేదు. కానీ, ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘క్యారవాన్‌’ మ్యాగజైన్‌ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. 2020 జూన్‌ నాటి సంగతి. గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాశ్‌ రేంజ్‌ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుద్ధ ప్రకటన!

2020 ఆగస్టు 31. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్‌ దూరంలో మోహరించాయి. భారత  కమాండర్లు అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలూ లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి. అప్పటి ఆర్మీ చీఫ్‌ నరవణె రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్‌ చేసి ‘ఏం చేయాలి?’ అని అడిగారు. వెంటనే స్పందన రాలేదు. తరువాత రక్షణ శాఖ మంత్రి నుండి ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. ‘ప్రధానితో మాట్లాడాను... జో ఉచిత్ సమ్‌ఝో వో కరో’ (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి). ఈ సూచన విని షాక్‌కు గురైనట్టు నరవణె రాసుకున్నారు. యుద్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది.

ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్‌పేయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణె ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో అలాంటి నిర్ణయాత్మక స్పష్టత కనిపించలేదూ అని! ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్థే నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని సైన్యం పాటిస్తుంది. చైనా విషయంలో మోదీ తడబడి నట్టుగా నరవణె కథనం ద్వారా అర్థం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.

జాతీయ భద్రత కారణంగా నరవణె పుస్తకాన్ని (Naravane Book) పరిశీలించాల్సి ఉందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తి కాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రత కన్నా తమకు ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఒక ఆర్మీ మాజీ ఛీఫ్‌ తన యుద్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా? ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో నరవణె పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించి నపుడు అధికార పక్షాలు అడ్డుకున్నాయి.

చ‌ద‌వండి: నరవణె పుస్తకంపై పెంగ్విన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

‘అగ్నివీర్‌’, ‘అగ్నిపథ్‌’ పథకాల మీద కూడా నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడా తక్కువనీ గుర్తు చేశారు. భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. క్యారవాన్‌ పత్రిక (caravan magazine) ఆ పుస్తకంలోని కొన్ని అంశాలతో ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మిగిలిన పుస్తకంలో ఇతర సందరాల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి ఉండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.

- డానీ 
వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement