ఏపీ ‘ఎకో సిస్టం’ ఇక ఇంతేనా? | political governance vs public administration in ap politics | Sakshi
Sakshi News home page

ఏపీ ‘ఎకో సిస్టం’ ఇక ఇంతేనా?

Mar 10 2026 8:16 AM | Updated on Mar 10 2026 8:18 AM

political governance vs public administration in ap politics

రాజకీయాల్లో గణాంకాలు ప్రధానం అనే భౌతిక (ఫిజిక్స్‌) సూత్రం నిజమే అయినా, గెలిచిన పార్టీ ‘పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ చట్రం పరిధిలోకి వచ్చాక గానీ, దాని వాస్తవ ‘కెమిస్ట్రీ’ మనకు అర్థం కాదు. అందుకు రెండు కారణాలు: ఒకటి– ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీకి ఓటు వేసిన ప్రజలు ‘మాకేంటి’ అని దానివైపు ఆశగా చూస్తారు. రెండు– ప్రభుత్వ పాలన రాజ్యాంగ పరిధిలో ఉండాలి కనుక, ఆ చట్రం దృష్టి నుంచే దాని మంచిచెడుల అంచనా ఉంటుంది. అలా ఈ రెండు కలిసి అంతిమంగా ఆ ప్రభుత్వం ‘కెమిస్ట్రీ’ని నిర్ధారిస్తాయి. 

ఇందులో ‘ఫిజిక్స్‌’ అనే మొదటిది కేవలం భౌతికం, మనకందే ప్రయోజనాల ఆరా వద్ద అది ఆగిపోతుంది. కానీ ‘కెమిస్ట్రీ’ అలా కాదు, ఒక నిర్ధారణకు రావడానికి ముందు అది సాకల్యంగా లోతుల్ని తడిమి, లోపలి వ్యర్థాల (టాక్సిక్‌)ను ముందు బయటకు నెడుతుంది. ఆ తర్వాత మాత్రమే నికరం (నెట్‌) ఏమిటో నిర్ధారిస్తుంది. అదొక పార్టీ అయినా, కొన్ని పార్టీల ‘కూటమి’ అయినా దాన్ని పుటం వేసే సూత్రం అయితే ఇదే!పోటీ నలభై ఏళ్ల పార్టీ, 12 ఏళ్ల పార్టీల మధ్య కావడంతో, తమకు అనువైన ‘ఎకో సిస్టం’ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది అనే విషయంలో తటస్థ పౌరులకు పదేళ్ళలో పూర్తి స్పష్టత వచ్చేసింది. తీరా ఎన్నికల ముందు పోటీ రెండు పార్టీల మధ్య కాదు ఒక పార్టీకి, మూడు పార్టీల కూటమికి మధ్య అయింది. గడచిన రెండేళ్ల ‘కూటమి’ పాలన అనుభవంతో పైన చెప్పుకున్న రెండు శ్రేణుల మదింపు ఏమిటి అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఏపీ  సీఎం తరుచూ ‘మాది పొలిటికల్‌ గవర్నెన్స్‌’ అంటుంటారు. అదే మాటను ఒక ప్రభుత్వ కార్యదర్శి ‘మాది ఎగ్జిక్యూటివ్‌ గవర్నెన్స్‌’ అని ఎక్కడా చెప్పరు. కారణం వాళ్ళు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళరు. ఐదేళ్లకు ఒకసారి ప్రజల వద్దకు ఎంపిక కోసం వెళ్ళేవాళ్ళకు ఒక ‘పొలిటికల్‌ గవర్నెన్స్‌’గా బయటకు ఎలా కనిపిస్తున్నాము అనే స్పృహ అవసరం. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి సీఎం కొత్త కలెక్టర్లతో మాట్లాడుతూ– ‘ఫాలో ఎస్‌వోపీస్‌’ అన్నారు. అంటే ‘‘మేము రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి, మిమ్మల్ని కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా పంపినప్పటికీ, మీరు మీ 
‘స్టాండర్డ్‌ అపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ అనుసరించి పనిచేయండి’’ అని చెప్పారన్నమాట. 

గత ప్రభుత్వంలో పని చేసిన ‘బ్యూరోక్రసీ’ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి నచ్చేట్టుగా పనిచేయనప్పుడు, తరుచూ బహిరంగ సభల్లో ఇలా– ‘మాది పొలిటికల్‌ గవర్నెన్స్‌’ అని íసీఎం చెప్పాల్సి వస్తుంది. ‘కూటమి’ గెలిచాక ఈ రెండేళ్లలో ఇప్పటికి రెండుసార్లు అందరు సెక్రటరీలు, హెచ్‌వోడీలతో సమావేశం ఏర్పాటుచేసి íసీఎం మాట్లాడారు. ఇప్పుడు కొత్త బడ్జెట్‌ ఆమోదం కూడా జరిగింది. అటువంటప్పుడు, కనీసం ప్రధాన శాఖల్లో అమలు కానున్న కొత్త విధాన నిర్ణయాలు పత్రికల్లో ప్రధాన వార్తలుగా కనిపించాలి కదా! మరి లేవేమి? మన ‘పొలిటికల్‌ గవర్నెన్స్‌’ గత ప్రభుత్వ పాలనలో ఉన్నవని చెబుతున్న లోపాలు మాత్రమే ‘హెడ్‌లైన్‌’ వార్తలుగా నెలలు తరబడి కనిపించడం ఏమిటి? ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమాత్రం ‘పాజిటివ్‌ వైబ్రేషన్స్‌’ ఇవ్వని ఇటువంటి వార్తల వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి భాషా ప్రజలకు ఒక గుర్తింపు, వారి సంస్కృతీ సంప్రదాయాలు అంటూ కొన్ని ఉంటాయి కదా; అక్కడ అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం అనే దానితో పనిలేకుండా వారికి ఉండే ఆ గుర్తింపు అయితే అలాగే చెక్కుచెదరకుండా ఉండాలి కదా! మరి రాజకీయాల కోసం ఒక రాష్ట్రం నుంచి ఏడాది పొడుగునా ఇలా (టాక్సిక్‌ కంటెంట్‌) ప్రతికూల వ్యర్థాలు ఈ ‘సోషల్‌ మీడియా’ రోజుల్లో ఇలా వెదజల్లుతూ ఉంటే, చివరికి అక్కడి ప్రజల పరపతి మాట ఏమిటి?   
వ్యాసకర్త సామాజికాంశాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement