నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం (16వ వసంతంలోకి అడుగిడుతున్న వైఎస్సార్సీపీ)
ప్రజాహితమే పరమావధిగా, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్సీపీ. 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఒక్కడితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.
ఇచ్చిన మాట కోసం ఎందాకైనా...
వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు.
ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, నిరు ద్యోగ వర్గాల సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ వచ్చారు.
మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలు
నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే... వారు ఉంటున్న పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్ర మించిన పదవులకు రాజీనామా చేసి... వైఎస్సార్సీపీలో చేరారు. ఖాళీ అయిన 19 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి 2012 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ అధిష్ఠానాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ను విచారణ పేరుతో పిలిపించిన సీబీఐ 2012 మే 27న అరెస్టు చేసింది. జగన్ ను అక్రమంగా నిర్బంధించడం ద్వారా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఏ కేసులోనైనా అరెస్టయిన వారికి 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలన్నది నిబంధన. కానీ 16 నెలల పాటు జైలులో అక్రమ నిర్బం«ధం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్సీపీని జగన్ బరిలోకి దించారు. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ బలమైన ప్రతి పక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలో, అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు. వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా మారుతుండటాన్ని చూసి ఓర్వలేని నాటి సీఎం చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కుట్రలు చేశారు. ఫిరా యించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువలకు సమాధి కట్టారు.
దీన్ని నిరసిస్తూ... ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో, మండుటెండలో, కుంభ వృష్టిలో 14 నెలలపాటు 3,648 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రను 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాలను ఒక పార్టీ దక్కించుకున్న దాఖలాలు ఇదివరకు లేవు.
సువర్ణాక్షరాల సుపరిపాలన
వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించడంతో 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్న ఏకైక పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసు కొచ్చారు. వికేంద్రీకరణతో సుపరిపాలన అందించారు.
తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి... 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు ఇచ్చి సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరించారు. నామి నేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చెప్పింది వైఎస్సార్సీపీ ఒక్కటేనని సామాజిక వేత్తలు ప్రశంసించారు.
అనునిత్యం ప్రజల్లోనే...
అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం... ‘సూపర్ సిక్స్’తో పాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయింది. అయినా అనునిత్యం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ తమ విధానం ప్రజాపక్షమని చాటి చెబుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే కక్ష సాధింపు చర్యలు, విధ్వంసం, హత్యాకాండకు దిగింది.
ఈ అరాచక పాలనను దేశానికి చాటి చెప్పేందుకు 2024 జూలై 24న ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా నిర్వహించారు. గత 22 నెలలుగా రైతు సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున పోరాటాలు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పాటుపడుతున్నారు.
– సాక్షి, అమరావతి బ్యూరో


