..తం సూర్యం ప్రణమామ్యహం
● ఉరవకొండ మండలంలో రెండు చారిత్రక ఆలయాలు
● సైన్స్కు అంతు చిక్కని రహస్యాలు
అనంతపురం కల్చరల్/ఉరవకొండ రూరల్: ఆరోగ్య ప్రదాతగా పూజలందుకునే ఆదిత్యుడికి భక్తినీరాజనాలర్పించే రోజుగా చెప్పుకునే పర్వదినం రథసప్తమి రానే వచ్చింది. సమస్త ప్రాణకోటికి జీవనాధారమై.. ఆయురారోగ్యాలనందించే ఈ పర్వదినం ఈసారి సూర్యదేవునికి ప్రీతికరమైన ఆదివారం రావడంతో జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురంలోని హెచ్చెల్సీ కాలనీలో ఉన్న మంజునాథ ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు బసవరాజస్వామి తెలిపారు.
అనంతకు ప్రత్యేకం..
ఏడు అశ్వాలపై ఆశీనుడై సూర్యభగవానుడు రథసప్తమి నాడు గగనతలంలో పయనిస్తూ మానవాళిని అనుగ్రహిస్తాడని, అందుకు కృతజ్ఞతగా చేసే పూజలే దీర్ఘాయుష్షును కలిగిస్తాయని భక్తులు భావిస్తారు. ఈ పర్వదినం రాకతో ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. అనంతపురంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, పాతూరులోని విరూపాక్షేశ్వరాలయం, మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయం, శివకోటి, శివబాలయోగి ఆశ్రమం తదితర చోట్ల రథసప్తమి పర్వదినం నాడు సాగే విశేష పూజోత్సవాలకు, నగరోత్సవాలకు ఆలయాలను సిద్ధం చేశారు. నగరంలో పలు చోట్ల ఆదివారం తెల్లవారుజామునే సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగించనున్నారు.
నమస్కార ‘యోగ’ం
అనంతపురంలోని వివేకానంద యోగ కేంద్రం ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం 5.45 గంటలకు సామూహిక సూర్యనమస్కార యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలలోని బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఈ వేడుక జరుగనుంది. 108 సూర్యనమస్కార మంత్రాలతో సాగే ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు రాజశేఖరరెడ్డి, యోగా గురువు దివాకర్ పిలుపునిచ్చారు.
అరుదైన సూర్య భగవానుడి ఆలయాలు
ఉరవకొండ మండలం బూదగవి, ఆమిద్యాల గ్రామాల్లోలోకానికి వెలుగులు పంచే సూర్యభగవానుడికి సంబంధించి చారిత్రక ఆలయాలు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉండటం విశేషం. సాధారణంగా సూర్యభగవానుడు తూర్పు అభిముఖంగా కొలువుదీరి ఉంటాడు. అయితే ఇందుకు భిన్నంగా ఆమిద్యాల గ్రామంలో పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తే, బూదగవిలో దక్షిణముఖంగా కనిపిస్తాడు. ఆమిద్యాలలోని సూర్యదేవాలయానికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చెబుతోంది. చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలిచే ఈ ఆలయంలో చెన్నకేశవస్వామి, శివుడు, సూర్యభగవానుడి విగ్రహాలకు ప్రత్యేక గర్భాలయాలు ఉన్నాయి. వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే తొలుత చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు. తూర్పు దిక్కుగా ఉన్న శివలింగానికి ఎదురుగా సప్తాశ్వాలపై సూర్యభగవానుడు కొలువుదీరి ఉంటాడు. భక్తులు శివకేశవులను ఒకేసారి సందర్శించొచ్చు. ఇక బూదగవిలో క్రీస్తు శకం 13వ శతాబ్ధంలో చోళరాజులు సూర్యదేవాలయం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే దక్షిణాభిముఖంగా ఉన్న ఏకై క సూర్యదేవాలయం. ఇక్కడ సూర్యనారాయణస్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కనిపిస్తారు. అలాగే రథసప్తమి నాడు ఉరవకొండలోని బూదగవి, తాడిపత్రి లోని చింతల వేంకటరమణస్వామి ఆలయంలో నేరుగా సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకడం సైన్స్కు అంతు చిక్కని రహస్యం. బూదగవిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం జరి గే రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు.
నేడు పెన్నహోబిలంలో రథసప్తమి
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఉదయం మూలవిరాట్కు సహస్ర నామార్చన చేస్తారు. అనంతరం లక్ష్మీ నృసింహస్వామికి సూర్యప్రభ, గోవాహన, హనుమంత వాహనోత్సవం, గరుడ వాహనోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం జరగనుంది.
క్రీ.శ. 13వ శతాబ్దం నాటి బూదగవి సూర్యనారాయణస్వామి ఆలయం, స్వామివారి మూలవిరాట్
సందర్భం నేడు రథసప్తమి వేడుక
..తం సూర్యం ప్రణమామ్యహం


