కరీంనగర్: ఒక్కడు ధైర్యం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని ఆరెపల్లి హనీట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆరెపల్లి సమీపంలో నివాసం ఉండే దంపతులు సోషల్ మీడియా వేదికగా అమాయకులను వ లలో పడేసి, నగ్న వీడియోలతో బెదిరిస్తూ రూ.లక్షలు దోచుకోగా.. ఎక్కువశాతం వ్యాపారస్తులే వీ రిమాయలో చిక్కినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు స మాచారం.
ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశలో దంపతులు సోషల్ మీడియా వేదికగా వలపు వల విసిరారు. పెద్దఎత్తున డబ్బులు గుంజడమే లక్ష్యంగా బ్లాక్మెయిల్ దందాకు దిగారు. ఓ వ్యా పారిని టార్గెట్ చేసి రూ.14 లక్షలు వసూలు చేశారు. మరో రూ.5లక్షలు కావాలని బెదిరించడంతో బాధితుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించా డు. కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించగా.. ప్రస్తుతం కస్టడీ తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ హనీట్రాప్లో రాజకీయ నాయకులు, బడాబాబులు సైతం బాధితులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. పోలీసుల విచారణపై ఆసక్తి నెలకొంది.


