గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది! | Telangana Govt estimating 8 crore people attend Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది!

Mar 11 2026 2:01 AM | Updated on Mar 11 2026 2:01 AM

Telangana Govt estimating 8 crore people attend Godavari Pushkaralu

పుణ్య స్నానాలు చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం 

మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. సన్నాహకాలపై చర్చ 

వచ్చే ఏడాది జూన్‌ 26–జూలై 7 వరకు 

ఆది పుష్కరాలు.. 2028 జూలై 13–24 అంత్య పుష్కరాలు 

నదీతీరంలోని 96 ప్రాంతాల్లో ఏర్పాట్లకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆది పుష్కరాల తర్వాత నిర్వహించే అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు పండితులు తేదీలు ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం పుష్కరాల నిర్వహణ ప్రణాళిక ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. కుంభమేళాకు చేసే ఏర్పాట్ల తరహాలోనే ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను గమనంలో ఉంచుకొని ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు. 

వచ్చే పుష్కరాల్లో దాదాపు 8 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఉప సంఘం సమవేశంలో అంచనా వేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్‌ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. భారీ సంఖ్యలో పుణ్యస్నానాలకు వస్తారని భావిస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. 

ఈ మేరకు 96 ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు, సులభంగా చేరుకునేలా మెరుగైన రోడ్లు నిర్మించాలని ఆదేశించింది. వానాకాలంలో పనులకు ఇబ్బందులుంటాయని, ఈలోపే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌లను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యమైన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సూచించగా, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన 9 ప్రాంతాలను తొలి విడత పనులకు అధికారులు ఎంపిక చేశారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్టు కమిటీ పేర్కొంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement