కిడ్నీ మార్పిడి జరిగిన వ్యక్తిలో ‘ప్యాంక్రియాటిక్ క్యాన్సర్’కు ఆపరేషన్
ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఇలాంటి సర్జరీ ప్రపంచంలోనే తొలిసారి అన్న డాక్టర్ నవీన్కుమార్
గచ్చిబౌలి (హైదరాబాద్): అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్కుమార్ మంగళవారం వివరాలను వెల్లడించారు. కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేసన్ అనంతరం మూడు రకాల ఇమ్యూనో సప్రెషన్ చికిత్స పొందుతున్న రోగిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ల్యాప్రోస్కోపిక్ విధానంలో ప్యాంక్రియాటో డ్యూడెనెక్టమీ చేయాలని నిర్ణయించామని చెప్పారు.
అయితే రోగికి అప్పటికే పాలీసిస్టిక్ లివర్ వ్యాధి, మార్పి డి చేసిన కిడ్నీలో పెద్ద తిత్తి (సిస్ట్) ఉండటంతో పాటు గతంలో ఓపెన్ బైలాటరల్ నెఫ్రెక్టమీ చేయించుకోవడం తదితర క్లిష్టమైన సమస్యలు ఉండడంతో సర్జరీ సంక్లిష్టంగా మారిందన్నారు. అలాగే చిన్న పేగు, కాలేయానికి కీలకమైన రక్తనాళం (సుపీరియర్ మెసెంటరిక్ వీన్) ప్రభావితమవడం కూడా సర్జరీకి మరో పెద్ద సవాల్గా నిలిచిందని వివరించారు.
ఈ నేపథ్యంలో ల్యాప్రోస్కోపిక్ విధానంలో ప్యాంక్రియాటో డ్యూడెనెక్టమీతో పాటు సంబంధిత ఎస్ఎం నాళాన్ని కట్ చేసి మరమ్మతు చేశామని తెలిపారు. విజయవంతంగా చికిత్స ల్యాప్రోస్కోపిక్ విధానంలో రక్తనాళాల తొలగింపు ఆపరేషన్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ ఆస్పత్రులలోనే జరుగుతున్నాయని డాక్టర్ నవీన్కుమార్ తెలిపారు. అందులోనూ సంక్లిష్టమైన ఇమ్యూనో సప్రెషన్లో ఉన్న రోగులకు ప్రధాన ప్యాంక్రియాస్ శస్త్ర చికిత్సల్లో మరణాల శాతం 50 వరకు ఉండే ప్రమాదం కూడా ఉందని చెప్పారు.
ప్రపంచంలోనే ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఇలాంటి శస్త్రచికిత్స ఇదే తొలిసారి కాగా ఇలాంటి మరో సర్జరీని అమెరికాలోని మేయో క్లినిక్లో ఓపెన్ సర్జరీ ద్వారా నిర్వహించారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ వరుణ్, డాక్టర్ జోయల్, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.


